Nurse Madhusmita Prusty : అనాథ శవాలకు అంత్యక్రియలు చేయటానికి ఉద్యోగం మానేసిన నర్సు
అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి ఒడిశాకు చెందిన నర్సు తన ఉద్యోగాన్ని మానేశారు. భర్తతో కలిసి కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు.
Odisha Nurse Quits Job : ఒడిశాకు చెందిన మధుస్మిత ప్రస్టీ అనే నర్సు..అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి తన ఉద్యోగాన్నే మానేసింది. ఆమె భర్తతో కలిసి అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు. తొమ్మిది సంవత్సరాలు నర్సుగా సేవలందించిన ఆమె 2019లో ఉద్యోగం మానేసింది. అప్పటి నుంచి భర్తతో కలిసి అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తోంది. అప్పటి వరకూ వాళ్లు రైల్వే ట్రాకులమీద ఆత్మహత్యలు చేసుకున్నవారికి..ఇంకా అనాథ మృతదేహాలుగా ముద్రపడివాటికి అంత్యక్రియలు చేస్తున్నారు నర్సు మధుస్మిత ఆమె భర్త కలిసి. కానీ..ఈకరోనా కాలంలో అనాథ మృతదేహాలు సంఖ్య పెరుగుతుండటంతో వారి పని మరింతగా పెరిగింది.
ఒడిశాకు చెందిన మధుస్మిత కోల్కతాలో ఫోర్టిన్ ఆసుపత్రిలో పీడియాట్రిక్ డిపార్ట్ మెంట్ లో నర్సుగా పనిచేసేవారు. తొమ్మిదేళ్లు నర్సు ఉద్యోగం చేసిన ఆమె ఉద్యోగం మానేసారు. ఆమె భర్త ఒడిశాలోని భువనేశ్వర్ లో మృతదేహాలకు అంత్యక్రియలు చేసేవారు. ఈక్రమంలో అతనికి కాలికి గాయమై బాధపడుతుండటంతో భర్తకు సహకరించాలనే ఉద్ధేశ్యంతో ఆమె ఉద్యోగం వదిలేసి భర్తకు సహకరించాలని నిర్ణయించుకుంది.
తన నిర్ణయాన్ని భర్తకు చెప్పింది. అలా తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఒడిశాలోని భువనేశ్వర్కు వచ్చేసింది. అనాథ శవాలకు అంత్యక్రియలు చేసే భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ దంపతులిద్దరూ..ఇప్పటి వరకూ 500 మృతదేహాలకు పైనే అంత్యక్రియలు చేశారు. ఇప్పటికే చేస్తూనే ఉన్నారు.
యావత్ దేశమంతా కరోనా కల్లోలంలో చిక్కుకుని గిజగిజలాడుతోంది.ఈ మహమ్మారికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాతో మృతి చెందినవారికి అంత్యక్రియలు చేసేందుకు అయినవారు కూడా ముందుకు రావడం లేదు. ఇటువంటి మృతదేహాలకు అంత్యక్రియలు చేయటానికి మేమున్నామంటున్నారు మధుస్మిత దంపతులు. కాగా..ఓ మహిళ అంత్యక్రియలు కార్యక్రమాలు చేయటంపై మొదట్లో అభ్యంతరం వ్యక్తంచేశారని..అది రాను రాను ఆ ఇబ్బంది తొలగిపోయిందని తెలిపారు మధుస్మిత.