CJI : సోషల్ మీడియా విషయంలో జడ్జిలకు సీజేఐ రమణ వార్నింగ్

సోషల్ మీడియా ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్‌ NV రమణ హెచ్చరించారు.

CJI : సోషల్ మీడియా విషయంలో జడ్జిలకు సీజేఐ రమణ వార్నింగ్

Ramana2

CJI సోషల్ మీడియా ద్వారా ప్రజలు వ్యక్తం చేసే భావోద్వేగమైన అభిప్రాయాలకు న్యాయమూర్తులు ప్రభావితం కాకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(CJI) జస్టిస్‌ NV రమణ హెచ్చరించారు. బుధవారం సాయంత్రం జస్టిస్‌ పి.డి. దేశాయ్‌ 17వ స్మారకోపన్యాస కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్న సీజేఐ… బిగ్గరగా చేసే నినాదాలు, వాస్తవాలు అత్యధిక ప్రజల అభిప్రాయాలకు ప్రతిబింబం కాకపోవచ్చన్న విషయాన్ని న్యాయమూర్తులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. మంచి-చెడు, తప్పు-ఒప్పు, అసలు-నకిలీల మధ్య వ్యత్యాసాలను తెలుసుకోలేని విధంగా విషయాన్ని విపరీతంగా ప్రేరేపించే శక్తి సోషల్ మీడియాకు ఉందన్నారు. కాబట్టి తీర్పులు వెలువరించడానికి మీడియా విచారణలు ప్రాతిపదిక కాకూడదన్నారు. స్వతంత్రంగా, బాహ్య ఒత్తిళ్లకు అతీతంగా నిలబడి పనిచేయడం అత్యంత ముఖ్యమని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయమూర్తుల సత్తాను పరీక్షించడానికి తీర్పులే నిజమైన కొలమానాలు. న్యాయమూర్తులు వెలువరించే గొప్ప తీర్పులు ఎప్పటికీ న్యాయబద్ధంగా గుర్తుంటాయని జస్టిస్‌ ఎన్ వీ రమణ పేర్కొన్నారు.

చట్టం ముందు అందరూ సమానమే అంటే న్యాయం అందరికీ సమానంగా అందుబాటులో ఉండటమేనని అర్థం అని జస్టిస్‌ రమణ తెలిపారు. మన దేశంలో చట్టబద్ధ పాలనకు ఇదే మూలసూత్రమని తెలిపారు. పేదరికం, నిరక్షరాస్యత, ఇతరత్రా బలహీనతల కారణంగా పేదలు తమ హక్కులను అనుభవించలేకపోతే సమానత్వ సిద్ధాంతానికి అర్థమే ఉండదన్నారు. స్త్రీ,పురుష సమానత్వం కూడా ముఖ్యమేనని తెలిపారు. మహిళా సాధికారత.. కేవలం వారి హక్కుల కోసం పోరాడటానికే కాకుండా సమాజానికీ ముఖ్యమని తెలిపారు.

ఇక, ప్రభుత్వ అధికారాలు, చర్యలను తనిఖీ చేసే సమయంలో న్యాయ వ్యవస్థకు సంపూర్ణ స్వాతంత్య్రం ఉండాలని ఈ సందర్భంగా సీజేఐ తెలిపారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల ద్వారా, చట్టాల రూపంలో న్యాయ వ్యవస్థను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానో నియంత్రించరాదని అభిప్రాయపడ్డారు. అందుకు భిన్నంగా జరిగితే రూల్‌ ఆఫ్‌ లా(చట్టబద్ధ పాలన)ఓ భ్రమగానే మిగిలిపోతుందని తెలిపారు.

దేశంలో ఇప్పటివరకు జరిగిన 17 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీలు, కూటములను ప్రజలు 8 సార్లు తిరస్కరించారు. అంటే 50% ప్రభుత్వాలు మారిపోయాయి. కీలక వ్యవస్థలకు నేతృత్వం వహిస్తున్న వారు రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా? లేదా? అని పరీక్షించుకోవాలి. పరిపాలకుడిని మార్చినంత మాత్రాన దౌర్జన్యాల నుంచి రక్షణ లభిస్తుందన్న హామీ ఏమీలేదు. రాజకీయ విభేదాలు, విమర్శలు, నిరసనలు ప్రజాస్వామ్య ప్రక్రియలో అంతర్భాగం. చట్టసభలు రూపొందించే చట్టాలు రాజ్యాంగ సూత్రాల ప్రకారం ఉండేలా చూసే ప్రాథమిక వ్యవస్థ న్యాయ వ్యవస్థే. దాని ప్రధాన విధి చట్టాలను సమీక్షించడమే. రాజ్యాంగ మూల సూత్రాల్లో భాగంగా సుప్రీంకోర్టు ఈ పని చేస్తోంది. దానిని పార్లమెంటు నియంత్రించలేదని సీజేఐ అన్నారు.

అయితే రాజ్యాంగాన్ని రక్షించే ప్రధాన బాధ్యత కేవలం కోర్టుల మీదే కాకుండా శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలపైనా ఉందని సీజేఐ తెలిపారు. న్యాయ వ్యవస్థ పాత్రకు పరిమితులున్నాయని…తన ముందుకొచ్చిన విషయాలను మాత్రమే అది పరిశీలించగలదన్నారు. ఈ పరిమితే రాజ్యాంగ విలువలను కాపాడే బాధ్యతలను మిగతా వ్యవస్థలకు అప్పగిస్తోందని సీజేఐ తెలిపారు. ప్రభుత్వాల మద్దతుతో రూపుదిద్దుకొనే ఏ చట్టమైనా కొన్ని ఆదర్శాలు, న్యాయసూత్రాలకు కట్టుబడి ఉండాలని, అలాంటి చట్టాల ప్రాతిపదికన పరిపాలన చేస్తున్నప్పుడే దాన్ని ‘రూల్‌ ఆఫ్‌ లా’గా అభివర్ణించడానికి వీలవుతుందని స్పష్టం చేశారు.