కేరళలో ఘనంగా మొదలైన ఓనం సంబరాలు

  • Published By: venkaiahnaidu ,Published On : September 2, 2019 / 11:50 AM IST
కేరళలో ఘనంగా మొదలైన ఓనం సంబరాలు

కేరళలో ఓనం సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కొచ్చి సమీపంలోని చారిత్రక ప్రాంతమైన త్రిపునిథురాలో ఘనంగా అథం వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.కె.బాలన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. కొచ్చిని పాలించిన రాజు తమ మొత్తం పరివారంతో త్రిపునిథురా కోట వరకు ప్రయాణించే రాజ ఆచారం జ్ఞాపకార్థంగా ఈ ఉత్సవం జరుగుతుంది. కులమతాలకు అతీతంగా మలయాళీలు ఎంతో ఇష్టంగా జరుపుకునే  ఓనం పండుగ 10 రోజుల ముందు  ఈ అథం వేడుకలు జరుగుతాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 11 న ఓనం వస్తుంది. ఓనం “చింగం” నెలలో వస్తుంది, ఇది మలయాళ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల. 

మలయాళీలు ఈ రోజు ఎంతో అదృష్టాన్ని తెచ్చే రోజుగా పరిగణిస్తున్నారు. ఇవాళ్టి నుంచీ పది రోజుల్లో రాబోయే ఓనమ్ వేడుకల కోసం ఇప్పటి నుంచీ సిద్ధమవుతున్నారు. మొన్నటిదాకా భారీ వర్షాలు, వరదలతో మునిగిన కేరళ… ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇవాళ కేరళీయులు… పిల్లలు, పెద్దలూ అందరూ పూలను సేకరిస్తున్నారు. అడవులు, తోటలు, గడ్డి మైదానాల్లో రకరకాల పూలను సేకరించడం అక్కడి ఆనవాయితీ. వాటిని తమ ఇళ్లకు, పూజా గదుల్లో పూజకూ ఉపయోగిస్తారు. ఫలితంగా ఇల్లంతా పూల పరిమళాలతో సరికొత్త ఆహ్లాదం కలిగిస్తుంది. కొన్ని రకాల ఆకులు, పండ్లను కూడా సేకరిస్తారు. ప్రధానంగా కొత్తిమీర, పుదీనా, అరటి, కూంగీ వంటివి సేకరిస్తారు. 

గతేడాది రికార్డు స్దాయిలో కురిసిన  భారీ వర్షాలు,వరదల కారణంగా కేరళలో ఓనం సెలబ్రేషన్స్ జరుగలేదు. ఈ ఏడాది కూడా కురిసిన భారీ వర్షాలు,వరదలు కారణంగా ప్రభావిత ప్రాంతాల్లో ఓనం సెలబ్రేషన్స్ అంతగా జరగడం లేదు. ఈసారి ఓనం వేడుకలు తక్కువ స్థాయిలో జరుగుతాయని కేరళ ప్రభుత్వం గత నెలలో ప్రకటించింది.