సరిహద్దు, తీర ప్రాంత భద్రతకు లక్ష మంది NCC కేడెట్లు : మోడీ
NCC cadets వరదలు లేదా ప్రకృతి వైపరీత్యాలు ఏం వచ్చినా ఎన్సీసీ కేడెట్లు దేశానికి ఎంతగానో సేవ చేశారని ప్రధాని మోడీ ప్రశంసించారు. గురువారం ఢిల్లీలోని కరియప్ప మైదానంలో జరిగిన నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్సీసీ) పరేడ్కు ప్రధాని హాజరయ్యారు. ఎన్సీసీ కేడెట్ల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ప్రధాని.. ఎన్సీసీ చేస్తోన్న సేవలను కొనియాడారు. దేశానికి సేవ చేయడంలో ఎన్సీసీ ఎప్పడూ ముందుందని కితాబిచ్చారు.
కరోనా సమయంలో లక్షలాది మంది కేడెట్లు అధికార యంత్రాంగానికి, సమాజానికి ఎంతో సహాయపడ్డారని మోడీ అన్నారు.సమాజంలో ఎన్సీసీ పాత్రను ప్రభుత్వం ఇంకా విస్తరించాలనుకుంటోందన్నారు. సరిహద్దు, తీర ప్రాంతాల్లో భద్రతను బలోపేతం చేసేందుకు ఎన్సీసీని మరింత శక్తిమంతం చేస్తామన్నారు.
దేశంలోని సరిహద్దు, తీర ప్రాంతాల్లోని 175 జిల్లాల్లో ఎన్సీసీకి కొత్త బాధ్యతలు అప్పగిస్తామని గత ఏడాది పంద్రాగస్టున ప్రకటించినట్లు మోడీ పేర్కొన్నారు. ఇందుకోసం లక్ష మంది కేడెట్లకు సైన్యం, వాయుసేన, నేవీ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందులో మూడింట ఒకవంతు మంది బాలికలు ఉన్నట్లు చెప్పారు.