దేశంలో 30కోట్ల మందికి పైగా కరోనా? సర్వే
Over 30 Crore Indians May Have COVID-19: 135కోట్ల జనాభా ఉన్న భారత్లో ఇప్పటివరకూ పావువంతు ప్రజలకు అంటే సుమారు 30కోట్ల మందికిపైగా కరోనా వ్యాపించి ఉండొచ్చని సర్వేలో తేలింది. ప్రభుత్వ సెరోలాజికల్ సర్వేకు చెందిన ఓ అధికారి ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం చూపిస్తున్న కేసుల సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రజలకు కరోనా వ్యాపించి ఉండొచ్చని వారు తెలిపారు. వీరిలో చాలా మందికి కరోనా వచ్చి తగ్గిన విషయం కూడా తెలియకపోవచ్చన్నారు. తగినంత రోగనిరోధక శక్తి ఉండటంతో చాలా మందిలో వైరస్ లక్షణాలు బయట పడట్లేదన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఈ సర్వేను నిర్వహించింది.
గతేడాది(2020) ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఓ సర్వేను నిర్వహించగా అందులో 30వేల మంది భాగమయ్యారు. అందులో 15మందిలో ఒకరిలో కొవిడ్ యాంటీబాడీలు గుర్తించామని తెలిపారు. ఎక్కువ జనాభా కలిగిన ప్రాంతాల్లో ఇది 6:1గా ఉన్నట్లు తేలిందన్నారు. గత వారం రెండు కోట్ల జనాభా ఉన్న ఢిల్లీలో నిర్వహించిన ఓ సర్వేలో సగం మందికి పైగా ప్రజలకు కరోనా వైరస్ వచ్చిందని గుర్తించారు. 60 శాతం ప్రజల్లో తగినంత రోగనిరోధక శక్తి ఉంటేనే వైరస్ చైన్ ని తెంచగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో తెలిపింది. ప్రస్తుతం భారత్లో 1.08కోట్ల కరోనా కేసులు.. లక్షా 54వేల 596 మరణాలు నమోదయ్యాయి.