హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు సీరమ్కు అనుమతి ఇవ్వండి, DCGIకి Oxford లేఖ
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను చుట్టేస్తున్న తరుణంలో వ్యాక్సిన్ తయారీకి శాస్త్రవేత్తలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీ రేసు ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకుంది. ఇప్పటికే పలు సంస్థలు హ్యూమన్ ట్రయల్స్ మొదలు పెట్టేశాయి. వీటిలో ఇప్పటివరకు, ఐదు సంస్థలు మాత్రం వ్యాక్సిన్ రేసులో ముందు వరుసలో ఉన్నాయి. బ్రిటన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తయారీ ప్రస్తుతం ఆఖరి అంకంలోకి ప్రవేశించింది. ఆక్స్ ఫర్డ్ పరిశోధకులు రూపొందిస్తున్న వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇచ్చింది. ఈ టీకా మానవులపై ఇప్పటికే విజయవంతంగా పరీక్షించారు. ఈ టీకా మూడో దశ ఎక్కువ సమయం తీసుకోదు.
క్లినికల్ ట్రయల్స్ కు పర్మిషన్ ఇవ్వండి:
కాగా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్పై మూడో దశ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కు అనుమతి ఇవ్వాలని కోవిడ్పై ఏర్పాటైన నిపుణుల కమిటీ శుక్రవారం(జూలై 31,2020) డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కు సిఫార్సు చేసింది. హ్యూమన్ ట్రయల్స్ అనుమతి కోరుతూ సీరమ్ సంస్థ గురువారం(జూలై 30,2020) నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేసింది. అదనపు సమాచారం జోడిస్తూ సవరించిన ప్రతిపాదనలను అందజేసింది. సీరమ్ దరఖాస్తుపై నిపుణుల కమిటీ శుక్రవారం చర్చించింది. దేశవ్యాప్తంగా 17 ప్రాంతాల్లో 1,600 మందిపై ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ను పరీక్షిస్తామని సీరమ్ కంపెనీ తెలిపింది. ఇందులో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీ కూడా ఉంది.
వ్యాక్సిన్ తయారీ రేసులో ముందున్న ఆక్స్ ఫర్డ్:
ప్రపంచవ్యాప్తంగా తయారుచేస్తున్న కొవిడ్-19 వ్యాక్సీన్ ప్రయోగాలలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సీన్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. యూకేకి చెందిన ప్రముఖ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, స్వీడిష్ డ్రగ్ మేకర్ ఆస్ట్రాజెనెకాతో (AstraZeneca) కలిసి వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. కాగా, ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న కొవిడ్-19 టీకాకు (వ్యాక్సిన్) భారత్లో రెండో, మూడో దశ హ్యుమన్ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతిని పుణెకి చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇటీవలే కోరింది. ఆగస్టులో భారత్ లో ట్రయల్స్ చేయాలని సీరమ్ భావిస్తోంది.
ఆగస్టు మూడో వారంలో భారత్ బయోటెక్ టీకా:
కరోనా కేసుల సంఖ్య ఒకవైపు పెరిగిపోతున్నప్పటికీ.. ఈ వ్యాధి కట్టడికి అత్యంత కీలకమైన వ్యాక్సిన్ విషయంలో ఆశలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒకవైపు అమెరికన్ కంపెనీ మోడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు ప్రారంభమవ్వగా.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టీకా కూడా కీలకమైన మూడో దశకు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది లోపు ఏదో ఒకటి కోవిడ్-19 నుంచి విముక్తి కల్పించవచ్చన్న ఆశలు బలపడుతున్నాయి. ఇక భారత్ బయోటెక్ రూపొందిస్తున్న టీకా సైతం ఆగస్టు మూడో వారంలో సిద్ధమైయ్యే చాన్స్ ఉందని ఐసీఎంఆర్ అంచనా వేస్తోంది.
కరోనా నివారణకు ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి సుమారు 150 టీకాలు రానున్నాయి. వాటిలో 140 వ్యాక్సిన్లు ప్రారంభ దశలోనే ఉన్నాయి. అయితే కొన్ని వ్యాక్సిన్లు మూడవ దశ ట్రయల్స్కు చేరుకున్నాయి. మోడెర్నా, ఫైజర్, ఆస్ట్రాజెనెకా, భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు ఇందులో ముందంజలో ఉన్నాయి.
అక్టోబర్ నాటికి ఆక్స్ ఫర్డ్ టీకా, ధర రూ.1000:
ఆస్ట్రాజెనెకా సంస్థతో కలిసి ఆక్స్ఫర్డ్ ఈ టీకాను తయారు చేస్తోంది. మొదటి, రెండవ ట్రయల్స్ పూర్తి చేసుకున్నాక బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో మూడవ దశ ట్రయల్ ప్రారంభమైంది. భారత దేశానికి చెందిన సీరం సంస్థ ఈ టీకా ఉత్పత్తికి ఆక్స్ఫర్డ్తో ఒప్పందం కుదుర్చుకుంది. సీరం సంస్థ కోవిడ్ షీల్డ్ పేరుతో వ్యాక్సిన్ను విక్రయించాలని యోచిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ఈ టీకాకు సంబంధించిన అత్యవసర మోతాదు అక్టోబర్ నాటికి తయారు కావచ్చు. భారతదేశంలో టీకా ధర రూ. 1,000 ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్లు ఈ టీకాను బుక్ చేసుకున్నాయి. భారతీయ కంపెనీ సీరం ఈ టీకాను ఉత్పత్తి చేస్తే ఈ సంవత్సరం చివరి నాటికి కొంత మోతాదు వరకూ అందుబాటులోకి రానుంది.