భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్.. ధర ఎంతంటే?

  • Published By: vamsi ,Published On : July 27, 2020 / 07:31 AM IST
భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్.. ధర ఎంతంటే?

కరోనా కాలంలో కనిపించని యుద్ధం చేస్తున్న ప్రపంచం కరోనాను కంట్రోల్ చెయ్యడానికి చాలా కష్టపడుతుంది. ఈ క్రమంలోనే కాస్త ఓదార్పు ఇచ్చేలా చేసిన విషయం ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన COVID-19 వ్యాక్సిన్. భారత్‌లో ఈ వ్యాక్సిన్ రెండవ, మూడవ దశల విచారణను ప్రారంభించడానికి సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిజిసిఐ) నుండి అనుమతి కోరింది.

ఆస్ట్రాజెనెకాతో కలిసి సిరమ్ ఇన్‌‌స్టిట్యూట్ ఆక్స్‌‍‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌‌ను తయారు చేస్తోంది. ‘కోవిషీల్డ్’ ట్రయల్స్ చేపట్టేందుకు డీసీజీఐ నుంచి అనుమతి కోరుతూ పుణేకు చెందిన ఈ డ్రగ్ సంస్థ అప్లికేషన్‌‌ను దాఖలు చేసింది. ఈ అప్లికేషన్ ప్రకారం, ఆరోగ్యంగా ఉన్న వారిలో ‘కోవిషీల్డ్’ సేఫ్టీ, రోగ నిరోధక శక్తిని గుర్తించేందుకు స్టడీ చేస్తుంది.

భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను కోవి షీల్డ్ పేరుతో ఉత్పత్తి చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారత్‌తో పాటు అల్ప.. మధ్యస్థాయి ఆదాయాలు ఉన్న అన్ని దేశాలకు ఫూణెలోని తమ యూనిట్ నుంచి కొవిషీల్డ్ పంపిణీ జరుగుతుందని కంపెనీ ఇప్పటికే స్పష్టం చేసింది.

అంతేకాదు.. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్ ఆక్స్‌ఫర్ట్‌దే అవుతుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. వచ్చే నెలలో భారత్‌లో తాము చేసే ప్రయోగ పరీక్షలో సత్ఫలితాలు ఇస్తే.. తొలి వ్యాక్సిన్ గా కోవి షీల్డ్ నిలుస్తుందని చెబుతున్న కంపెనీ, COVID-19 వ్యాక్సిన్ రెండవ దశలో 1,600 మంది పాల్గొంటున్నట్లు చెప్పింది. విచారణ వచ్చే నెలలో ప్రారంభం అవుతుంది.

ఈ సంవత్సరం చివరి నాటికి, డిసెంబర్‌లో 3 నుంచి 4 మిలియన్ మోతాదులను ఉత్పత్తి చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది సంస్థ. సీరం ఇన్స్‌స్టిట్యూట్ అక్టోబర్ వరకు నెలకు 70 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను తయారు చేస్తుంది. డిసెంబర్ నాటికి నెలకు 100 మిలియన్ల వరకు ఉత్పత్తి చెయ్యాలని యోచిస్తోంది.

ఇక భారతదేశంలో ఆక్స్‌‌ఫర్డ్ యూనివర్సిటీ COVID-19 వ్యాక్సిన్ ధర విషయానికి వస్తే, ఒక్క మోతాదు రూ. 1000 వరకు ఉంచనున్నట్లు కంపెనీ చెబుతుంది. మీజిల్స్ మరియు ఇతర వ్యాధులకు విరుగుడు మందుల మాదిరిగానే రెండు లేదా అంతకంటే ఎక్కువ మోతాదులు కోవిడ్‌-19కి కూడా అవసరం అయ్యే అవకాశం ఉందని కంపెనీ చెబుతుంది. 2021 మొదటి త్రైమాసికం నాటికి ఈ వ్యాక్సిన్ పెద్ద సంఖ్యలో భారత ప్రజలకు చేరుతుందని వారు భావిస్తున్నారు.