మారని పాక్ వక్రబుద్ధి…రాత్రిపూట డ్రోన్లతో ఉగ్రవాదులకు ఆయుధాలు సప్లయ్

  • Published By: venkaiahnaidu ,Published On : September 22, 2020 / 10:13 PM IST
మారని పాక్ వక్రబుద్ధి…రాత్రిపూట డ్రోన్లతో ఉగ్రవాదులకు ఆయుధాలు సప్లయ్

బోర్డర్ లో పాకిస్థాన్‌ తన దుష్ట ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. రాత్రిపూట ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఉగ్రవాదుల కోసం చేరవేస్తున్న పాకిస్థాన్​ డ్రోన్​ను జమ్ముకశ్మీర్​ లోని నియంత్రణ రేఖ వెంబడి అఖ్​నూర్​లో స్వాధీనం చేసుకున్నాయి భద్రతా దళాలు.

పాక్‌ కు చెందిన డ్రోన్లు రాత్రిపూట నియంత్రణ రేఖ(LoC) వెంబడి ఓ గ్రామంలో ఆయుధాలు జారవిడుస్తున్నట్టుగా అందిన నిర్ధిష్ట సమాచారం ఆధారంగా పోలీసులు ఆ ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా జాద్‌ సొహాల్‌ గ్రామం నుంచి రెండు ఏకే రైఫిల్స్‌, ఒక పిస్తోల్‌, మూడు ఏకే మ్యాగజైన్లు, 90 రౌండ్లు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. భారత సరిహద్దుకు 12కి.మీల దూరంలో ఉన్న అఖ్నూరులో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.


ఈ ఆయుధాలను కశ్మీర్‌ లోయలో ఉన్న ఉగ్రవాదులకు అందిస్తున్నట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. దీని వెనుక జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ ఉన్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు ‌ తెలిపారు. కాగా, కొద్దిరోజుల క్రితం రాజౌరీలో భారీగా ఆయుధాలు చేరవేస్తోన్న డ్రోన్​ను స్వాధీనం చేసుకున్న సైన్యం.. ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

గతేడాది కూడా పంజాబ్‌ సరిహద్దు సమీపంలో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. పంజాబ్‌ పోలీసులు కూడా గతేడాది అక్టోబర్‌లో డ్రోన్లు ఏకే 47 రైఫిల్స్, గ్రనేడ్‌లు, శాటిలైట్‌ ఫోన్లు జారవిడుస్తున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే.