రాసిపెట్టుకోండి…2025 తర్వాత భారత్ లో పాక్ విలీనం!
RSS సీనియర్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2025 తర్వాత పాకిస్తాన్… భారత్ లో భాగం అవుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సమస్యపై ముంబైలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ మాదిరి అఖండ భారత్ రూపొందడానికి దారులు తెరుచుకుని ఉన్నాయని అన్నారు. రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో కరాచీ, లాహోర్, రావల్పిండిలలో ఇళ్లు కొనుక్కోవాలనే, బిజినెస్ చేయాలనే కల నెరవేరబోతుందనే విషయాన్ని రాసిపెట్టుకోండని అన్నారు.
1947కు మందు పాకిస్తాన్ అనేది లేదు.. 1945కు ముందు ప్రజలు దానిని హిందూస్తాన్లో భాగంగానే పరిగణించేవారు. అలాంటి పాకిస్తాన్ మళ్లీ 2025 తర్వాత తిరిగి హిందూస్తాన్ లో భాగం కానుంది. అఖండ భారత్ కల సాకరమవుతుందనే నమ్మకం కలుగుతోంది. తొలిసారిగా భారత ప్రభుత్వం కశ్మీర్ సమస్యపై కఠిన వైఖరి తీసుకుంది.. తద్వారా సైన్యానికి ఆత్మవిశ్వాసం పెరిగింది. తాజాగా కశ్మీర్లో పరిస్థితులు మారాయి. ఇకపై లాహోర్లో జీవించడానికి.. చైనా అనుమతి తీసుకోకుండా మానసరోవరం వెళ్లడానికి కలలు కనవచ్చని ఆయన తెలిపారు.పాక్ ను బలవంతంగా ఆక్రమించుకునేందుకే చైనా పాక్ కు మద్దతిస్తోందని, డోక్లామ్ లో తమని భారత్ ఓడించిందన్న కోపంతో చైనా ఉందన్నారు.