అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఈపీఎస్
అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి ఎన్నికయ్యారు.
PALANISWAMY అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి పళనిస్వామి ఎన్నికయ్యారు. సోమవారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఏఐఏడీఎంకే శాసనసభాపక్ష సమావేశంలో పళనిస్వామిని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ముందుగా ఎడప్పాడి పళనిస్వామి, లేదా ఓ పన్నీర్ సెల్వం ఎన్నికవుతారని వారిద్దరి మధ్యే పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే.. పార్టీ శాసనసభ్యులంతా ఈపీఎస్నే ఎన్నుకున్నాయి. దీంతో ఇక నుంచి పళనిస్వామి తమిళనాడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారని పార్టీ నేతలు తెలిపారు
కాగా,ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకుగాను ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 159 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో డీఎంకే నేత స్టాలిన్ తమిళనాడు సీఎంగా రెండు రోజుల క్రితం భాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మరోవైపు, గత పదేండ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే తాజా ఎన్నికల్లో కేవలం 72 స్థానాలకు పరిమితమైంది. దీంతో గత నాలుగేళ్ల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన పళనిస్వామి ఇప్పుడు ప్రతిపక్ష నేత అయ్యారు.