రైళ్లలో ప్రయాణికులు తప్పని సరిగా భౌతికదూరం పాటించాలి : లవ్ అగర్వాల్

  • Published By: srihari ,Published On : May 11, 2020 / 01:45 PM IST
రైళ్లలో ప్రయాణికులు తప్పని సరిగా భౌతికదూరం పాటించాలి : లవ్ అగర్వాల్

రైళ్లలో ప్రయాణికులు తప్పని సరిగా భౌతికదూరం పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. వరుస కార్మికుల కోసం మరిన్ని రైళ్లు నడుపుతామని చెప్పారు. రేపటి నుంచి టికెట్ కన్ఫామ్ అయిన వాళ్లు రైల్వే స్టేషన్ కు రావొచ్చన్నారు.

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా వలసకార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ఇటీవల ఇండియన్ రైల్వే శ్రామిక్ రైళ్లు” పేరుతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే సాధ్యమైనంత ఎక్కువ మంది కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు శ్రామిక్ రైళ్ల సంఖ్యను మరింతగా పెంచనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

మంగళవారం ( మే 12,2020) నుంచి 15 జంట రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ ఆదివారం నిర్ణయించింది. ఈ రైళ్లకు ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి బుకింగ్ ప్రారంభమయింది. న్యూ ఢిల్లీ రైల్వేస్టేషన్ నుంచి దిబ్రూగడ్, అగర్తల, హవ్డా, పట్నా, బిలాస్పుర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావిల మధ్య నడవనున్నాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తారు. IRCTC వెబ్ సైట్ ద్వారానే ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రైల్వేస్టేషన్లలోని టికెట్ల కౌంటర్లు మాత్రం తెరుచుకోవు. కన్ఫర్మ్ టికెట్లు ఉన్న ప్రయాణికులను మాత్రమే రైల్వేస్టేషన్లలోకి అనుమతించే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కోసం ప్రయాణికులు కనీసం గంట ముందుగా స్టేషన్‌కు రావాల్సి ఉంటుంది. ఈ రైళ్లలో జనరల్ బోగీలు ఉండవు. టికెట్లపై ఎలాంటి రాయితీలు ఉండవు. 

ప్రత్యేక సోషల్ డిస్టెన్స్ నిబంధనలో భాగంగా ఇప్పటివరకు ఖాళీగా ఉంచుతూ వస్తున్న మధ్య బెర్తులను కూడా ప్రయాణికులకు కేటాయిస్తామని తెలిపారు. ఒక రైలులో 24 బోగీలు ఉంటాయని, ఒక్కో బోగీలో 72 మంది ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.