దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా, ఇంతగా పతనం కావడానికి కారణమేంటి

  • Published By: naveen ,Published On : November 20, 2020 / 02:22 PM IST
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా, ఇంతగా పతనం కావడానికి కారణమేంటి

congress condition: దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందా. పరాజయం పాలవడానికే కాంగ్రెస్ పోటీ చేస్తుందా? అంటే.. చాలామంది ఔననే అంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీదాకా ఆ పార్టీ పరిస్థితి అదేనంటున్నారు. అసలు స్వయంగా పార్టీకే ఓ అధ్యక్షుడు ఫుల్‌టైమ్ లేనప్పుడు, రాష్ట్ర స్థాయిలో కానీ.. జిల్లా స్థాయిలో కానీ పార్టీని నడిపించడానికి మాత్రం లీడర్లు ఎలా ఉంటారు. అందుకే దుబ్బాక టూ ఢిల్లీనే కాదు, గ్రేటర్ పోరులోనూ అసలు కాంగ్రెస్ ఊసే కన్పించదంటున్నారు. ఇంతకీ కాంగ్రెస్ ఈ స్థాయిలో పతనం కావడానికి కారణమేంటి..? కాంగ్రెస్ పార్టీ పరిస్థితేంటి..దాని స్థితేంటి..గతేంటి.? అసలు పార్టీ తిరిగి పూర్వ వైభవం మాట అటుంచి..ఓ పార్టీగా అయినా మనుగడ సాగిస్తుందా..?

కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిందట:
జాతీయ రాజకీయాల్లో బీహార్…రాష్ట్రంలో దుబ్బాక కాంగ్రెస్ సిచ్యుయేషన్ ఏంటో అందరికీ మరోసారి తెలిసేలా చేశాయ్.. బిహార్‌లో ఆ పార్టీ దక్కించుకున్న సీట్ల సంఖ్య చూస్తే..ఈ నంబర్ కోసమేనా అంతగా పార్టీ తాపత్రయపడింది. అంతగా హంగామా చేసిందీ అన్పించకమానదు. అందుకే ఈ దశలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కామెంట్స్ కాక రేపుతున్నాయ్. అసలు ఓ ఆల్టర్నేటివ్‌గా తమని జనం ఏ దశలో కూడా చూడటం లేదని కుండబద్దలు కొట్టేశారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం..కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిందట..అని మాత్రమే ఇకపై చెప్పుకోవాల్సి వస్తుంది..ఆల్రెడీ ఇప్పటికే ఆ పరిస్థితి వచ్చేసింది కూడా.

సింగిల్ లార్జెస్ట్ లూజర్ పార్టీగా బీహార్ లో కాంగ్రెస్ రికార్డ్:
బీహార్‌లో కాంగ్రెస్ ఓ రికార్డ్ క్రియేట్ చేసింది.. సింగిల్ లార్జెస్ట్ లూజర్ పార్టీగా ఆవిర్భవించడమే. 243 సీట్లున్న బిహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ పోటీ చేసిందే 70 స్థానాల్లో 51 చోట్ల ఓడిపోయింది. 19 మాత్రమే గెలిచింది..ఓటింగ్ శాతం 9.48శాతం మాత్రమే..అంతకు ముందు ఎన్నికల్లో కాంగ్రెస్‌కి బీహార్‌లో 27 సీట్లున్నాయ్. అంటే రోజురోజుకీ కాంగ్రెస్ పాత్ర నామమాత్రం అయిపోయిందనడానికి ఈ లెక్కలే నిదర్శనం.. మరోవైపు దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోతున్న వామపక్ష పార్టీలు ఇక్కడ తమ బలం పెంచుకోగా..కాంగ్రెస్ ఇలా దిగజారిపోవడం ఆ పార్టీ ఎలా పయనిస్తుందో తెలుపుతోంది.

రాబోయే రోజులు కష్టకాలమే:
మతతత్వ పార్టీగా చెప్పే ఎంఐఎం కేవలం 1.24శాతం ఓటింగ్‌తో ఐదు ఎమ్మెల్యే స్థానాలు చేజిక్కించుకోవడం, కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో ఎదుర్కొనే కష్టకాలానికి సంకేతం. ఘన విజయం సాధించిన మధ్యప్రదేశ్‌లో అధికారం చేజారిపోయింది. ఐతే బైపోల్స్‌లో పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య పక్కనబెడితే.. యూపీ బైపోల్స్‌లో కాంగ్రెస్‌కి 2శాతం మాత్రమే ఓట్లు రావడం చూస్తే.. పార్టీ నావ ఏ తీరానికి చేరుతుందో అనే సందేహం కలగకమానదు.

ప్రశ్నించిన వాళ్లపై పార్టీ ద్రోహులనే ముద్ర:
ఇదంతా జాతీయ రాజకీయాల సంగతైతే.. తెలంగాణలో దుబ్బాకలో డిపాజిట్ కొట్టేసింది.. మరి ఇలాంటి సిచ్యుయేషన్‌లో పార్టీపై ఎవరికి ఆశలు ఉంటాయ్. కార్యకర్తలనే వాళ్లు పార్టీని ఎందుకు మోస్తారు..బహుశా ఇది గమనించే కాబోలు చాలామంది లీడర్లు..కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పేశారు..చెప్తున్నారు..ఐతే పార్టీ అగ్రనాయకత్వం అనబడే వాళ్లు మాత్రం ఈ పరిస్థితిపై ఫోకస్ పెట్టినట్లే కన్పించదు..పైగా ప్రశ్నించిన వాళ్లపై పార్టీ ద్రోహులనే ముద్ర వేస్తున్నారని ఆరోపణలున్నాయ్. గత సిడబ్ల్యూసీ భేటీ సందర్భంగా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ లాంటి నేతలు రాసిన లేఖ పెద్ద దుమారమే రేపింది.

బీహార్ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ ఓటమికి కాంగ్రెస్సే కారణం:
అయినా సరే కాంగ్రెస్ లీడర్‌షిప్‌లో మార్పు లేదు. ఇంతలో బీహార్ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ ఓటమికి కాంగ్రెస్సే కారణమనే విమర్శలూ వచ్చాయ్. ఏకంగా 70 సీట్లలో పోటీ చేయడం.. అందులో 51 కోల్పోవడమే కూటమి కొంప ముంచిందని.. కాంగ్రెస్ తమ పాలిట భస్మాసుర హస్తంగా మారిందని చాలామంది ఆర్జేడీ నేతలు బీహార్‌లో కామెంట్ చేశారు. దానికి తగ్గట్లే కపిల్ సిబల్.. తమ పార్టీ దగ్గరకు జనం రావడం లేదని ఆత్మవిమర్శ చేసుకునే అలవాటే పార్టీకి లేదంటూ సంచలనం కలిగించారు.

సింగిల్ లైన్‌లో చెప్పాలంటే.. కాంగ్రెస్ ఓ చుక్కాని లేని నావ:
కాంగ్రెస్ అంటేనే అదో రాజరికం నడిచే పార్టీ అంటారు.. దానికి తగ్గట్లుగానే అధినాయకత్వం అని చెప్పబడేవాళ్లు అప్పుడప్పుడూ గెస్ట్ అప్పియెరెన్స్ ఇవ్వడం..తర్వాత కన్పించకుండా పోవడం మామూలైంది..దీన్నే కపిల్ సిబల్ ఇన్‌డైరక్ట్‌గా ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకే ఓ లీడర్ లేనప్పుడు.. ఇక రాష్ట్రాల సంగతి చెప్పేదేముంది.. అందుకే పార్టీ పరిస్థితి ఇలా తయారైందంటారు.. ఎక్కడైనా ఓటు బ్యాంక్, ఓటుశాతం మిగిలి ఉన్నా.. అది కాస్తా..అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను చీల్చడానికే తప్ప ఆల్టర్నేటివ్‌గా మాత్రం మారడం లేదు.. సింగిల్ లైన్‌లో చెప్పాలంటే.. కాంగ్రెస్ ఓ చుక్కాని లేని నావ.. అది మునుగుతుందో.. తేలుతుందో.. అసలే తీరాలకు చేరుతుందో చెప్పలేం..