Pegasus : దాచిపెట్టిందేమీ లేదు..పెగసస్పై మరో అఫిడవిట్ సమర్పించలేం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాము ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివరంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని అనుకోవడం లేదని
Pegasus దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగసస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తాము ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివరంగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని అనుకోవడం లేదని సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పెగసస్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న పిటిషన్లపై సోమవారం ప్రధాన నాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా… దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా చెప్పారు. ఏదైనా సాఫ్ట్వేర్ను ప్రభుత్వం వాడిందా లేదా అన్నది పబ్లిక్గా చర్చించే అంశం కాదు. ఈ అంశాన్ని అఫిడవిట్లో భాగం చేయడం జాతి ప్రయోజనాలకు మంచిది కాదు అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి చెప్పారు.
పెగసస్ వ్యవహారంలో తాము దాచి పెట్టింది ఏమీ లేదని.. అందుకే ప్రభుత్వమే తనకు తానుగా ఈ ఆరోపణలపై విచారణ జరపడానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిందని సొలిసిటర్ జనరల్ ధర్మాసనానికి వివరించారు. అయితే పెగసస్ అంశం అత్యంత ముఖ్యమైనదేనన్న ఆయన.. కేంద్ర ఏర్పాటు కమిటీ అన్నీ పరిశీలించి కోర్టుకు నివేదిస్తుందని చెప్పారు.
కేంద్ర అభిప్రాయంతో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి..దేశ భద్రతతో ముడిపడిన అంశాలు చర్చించడం మంచిది కాదన్నదే తమ అభిప్రాయమని పేర్కొంది. దేశభద్రత, శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని, రక్షణ తదితర అంశాలను ధర్మాసనం అడగటం లేదన్నారు. అయితే కేంద్రం పదేపదే ఇదే విషయాన్ని ప్రస్తావించటాన్ని తప్పుబట్టారు. పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో స్పష్టం చేస్తే చాలని చెప్పారు. గోప్యతా హక్కుల ఉల్లంఘన ఆరోపణలకే పరిమితం కావాలని కేంద్రానికి స్పష్టం చేశారు.
అటు కేంద్రం వాదనలను పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు. వాస్తవాలు చెప్పబోమని ప్రభుత్వం అంటోందని ఆయన ఆరోపించారు.
READ Israeli hack-for-hire: ప్రతిపక్షాలు, జర్నలిస్ట్లు టార్గెట్గా ఉగ్రవాదులపై కన్నేసే స్పైవేర్