కాయ్ రాజా కాయ్.. కరోనాపై బెట్టింగ్లు..
కాయ్ రాజా కాయ్ అంటూ కరోనాపై కూడా బెట్టింగ్లు పెట్టేస్తున్నారు బాబోయ్.. రాజకీయాలు, సినిమా, క్రికెట్ ఇలా అన్నింట్లో జోరుగా నడిచే బెట్టింగులు.. ఇప్పుడు కరోనా సమయంలో కూడా సాగుతున్నాయి. వాస్తవానికి బెట్టింగుల జోరు ఎక్కువగా ఉండేది ఐపీఎల్ సీజన్లోనే.. అయితే ఈసారి ఐపీఎల్ సీజన్ కాస్తా కరోనా కారణంగా జరగకుండా పోయింది.
ఈ క్రమంలోనే బెట్టింగ్లకు కాదేది అనర్హం అన్నట్లుగా ఇప్పుడు లేటెస్ట్గా కోవిడ్–19పై పందెరాయుళ్లు పందెం కాస్తున్నారు. కర్ణాటకలో కోవిడ్–19 విధ్వంసం సృష్టిస్తోండగా.. ఇప్పుడు కరోనా కేసులపై బెట్టింగులు కాస్తున్నారు. హెల్త్ బులిటిన్ ఆధారంగా కేసులు వందల స్థాయి నుంచి వేల స్థాయికి చేరుకోగా.. రోజుకి వెయ్యి నుంచి రెండు వేల వరకు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.
అయితే ఈ రోజు ఎన్ని కేసులు నమోదు అవుతాయి? వెయ్యి లేదా రెండు వేలు అంటూ బెట్టింగులు జోరుగా నడిపిస్తున్నారు. ప్రతి రోజూ సాయంత్రం హెల్త్ బులిటిన్ విడుదల అయిన తర్వాత ఆ సంఖ్యను చూసి ఆ తర్వాత గెలిచిన వ్యక్తి ఖాతాకు నగదును ట్రాన్స్ఫర్ చేస్తున్నారట.
క్రికెట్ తరహాలో కోవిడ్ బెట్టింగ్లు కరోనా బెట్టింగుల వ్యవహారం పోలీసుల దృష్టికి రాగా..కర్ణాటకలో ముఖ్యంగా పాత మైసూరు, చామరాజనగర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఇలాంటి బెట్టింగులు జోరుగా సాగుతున్నాయని అంటున్నారు.