స్వాతంత్య్ర సమర యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తాం..’ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ ప్రారంభించిన మోడీ

స్వాతంత్య్ర సమర యోధుల స్ఫూర్తిని కొనసాగిస్తాం..’ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ ప్రారంభించిన మోడీ

Modi1

modi 75 ఏళ్ల స్వాతంత్ర్య సంబరాలకు గుర్తుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలను శుక్రవారం మోడీ ప్రారంభించారు. స్వాతంత్య్ర సమరయోధులకు ఘన నివాళిగా అమృత మహోత్సవ్‌ వేడుకలు అని ప్రధాని అభివర్ణించారు. 75 వ స్వాతంత్య్ర వార్షికోత్సవ వేడుకలు.. 2023 ఆగస్టు 15 వరకు కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమం కోసం శుక్రవారం అహ్మదాబాద్‌ చేరుకున్న ప్రధాని.. నేరుగా సబర్మతీ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో మోడీ తన సందేశాన్ని రాశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో అనేక పోరాటాలు, అనేక బలిదానాలను మరోసారి గుర్తుతెచ్చుకొని దేశం మొత్తం పునరుత్తేజం అవుతుంది. ఈ చారిత్రక సందర్భాన నేను మహాత్మగాంధీ పాదాలకు నమస్కరిస్తున్నాను. దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో తమను తాము అర్పించుకున్న వారికి, దేశానికి నేతృత్వం వహించిన వారికి, అందరూ మహానుభావుల పాదాలకు నమస్సులు సమర్పిస్తున్నాను. ఈ 75 ఏళ్లల్లో దేశాన్ని ఇక్కడివరకూ తీసుకొచ్చిన వారందరికీ ప్రణామాలు. స్వాతంత్య్ర సంగ్రామం, 75 ఏళ్ల ఆలోచనలు, 75 ఏళ్ల విజయాలు, 75 ఏళ్ల చర్యలు, 75 ఏళ్ల పరిష్కారాలు ఈ ఐదు స్తంభాలు.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రేరణగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

స్వాతంత్య్ర సంగ్రామంలో అమర వీరుల స్ఫూర్తిని కొనసాగిస్తామని అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను ప్రారంభించిన సందర్భంగా మోడీ తెలిపారు. ఈ మహోత్సవ్‌… దేశ మేల్కొలుపు కోసం. ఈ మహోత్సవ్‌.. స్వరాజ్య కలలను సాకారం చేసేందుకు. ఈ మహోత్సవ్‌… విశ్వశాంతి కోసం అని ప్రధాని తెలిపారు. దేశంలో ఉప్పు.. నమ్మకం, విధేయతకు చిహ్నం. మేము దేశం ఉప్పు తిన్నామని మనం ఈరోజుకు చెప్తాం. ఎందుకంటే ఉప్పు మన శ్రమ, సమానత్వానికి ప్రతీక అన్నారు. 1857 స్వాతంత్య్ర సంగ్రామం, మహాత్మగాంధీ పోరాటం, లోకమాన్య తిలక్ సంపూర్ణ స్వరాజ్ పిలుపు, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ డీల్లీ మార్చ్‌… ఇప్పటికీ దేశం మరచిపోలేదన్నారు. పండిట్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, సుభాష్‌ చంద్రబోస్‌, మౌలానా ఆజాద్‌, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌, వీర్‌సావర్కర్‌ వంటి జన నేతలు స్వాతంత్య్ర సంగ్రామానికి దిశా నిర్దేశం చేశారన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల ఆశ‌యాల‌ను నెర‌వేర్చేందుకు యువ‌త‌, విద్యావంతులు బాధ్య‌త తీసుకోవాల‌ని ప్రధాని పిలుపునిచ్చారు. మ‌న దేశం సాధించిన ఘ‌న‌త‌ను ప్ర‌పంచ దేశాల‌కు తెలియ‌జేయాల‌న్నారు.

క‌ళ‌లు, సాహిత్యం, నాట‌క రంగం, చిత్ర ప‌రిశ్ర‌మ‌, డిజిట‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగాల‌కు చెందిన వారు స్వాతంత్రోద్య‌మానికి చెందిన‌ విశిష్ట‌మైన క‌థ‌ల‌ను విస్తృత ప్ర‌చారం చేయాల‌ని ప్ర‌ధాని కోరారు. మ‌న రాజ్యాంగం ప‌ట్ల గ‌ర్వంగా ఫీల‌వాల‌న్నారు. ప్ర‌జాస్వామ్య సాంప్ర‌దాయాల ప‌ట్ల గ‌ర్వ‌ప‌డాల‌న్నారు. ప్ర‌జాస్వామ్యానికి ఇండియా త‌ల్లి వంటిద‌ని, ఆ ప్ర‌జాస్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తూ ముందుకు వెళ్తున్నామ‌న్నారు. దేశ వైభ‌వోప‌త చ‌రిత్ర‌ను సంర‌క్షించేందుకు గ‌త ఆరేళ్ల నుంచి తీవ్ర ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు ప్ర‌ధాని వెల్ల‌డించారు. ప్ర‌తి రాష్ట్రం, ప్ర‌తి ప్రాంతంలోనూ ఇలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

వ్యాక్సిన్ ఉత్ప‌త్తిలో భార‌త్ స్వ‌యంస‌మృద్ధి సాధించింద‌ని, దీని వ‌ల్ల ప్ర‌పంచ దేశాల‌కు కూడా ఉప‌యోగం జ‌రిగింద‌న్నారు. భార‌త్ సాధించిన ఘ‌న‌త‌ల‌న్నీ కేవ‌లం మ‌న దేశానికే కాదు అని, ఆ ఘ‌న‌తలు యావ‌త్ ప్ర‌పంచానికి మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తాయ‌ని ప్ర‌ధాని తెలిపారు. స్వ‌యంస‌మృద్ధితో నిండిన మ‌న దేశ ప్ర‌యాణం.. ప్ర‌పంచ దేశాల అభివృద్ధిని కూడా వేగ‌వంతం చేస్తుంద‌ని ప్ర‌ధాని అన్నారు.

దండి మార్చ్
వేడుకల్లో భాగంగా.. ఇవాళ సబర్మతీ ఆశ్రమం నుంచి దండియాత్రను జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని. 241 మైళ్ల దూరం 25 రోజుల పాటు కొనసాగనున్న ఈ పాదయాత్ర ఏప్రిల్​ 5న దండిలో ముగుస్తుంది. దేశ ప్రజలను ఏకం చేసిన మహాత్ముడి స్ఫూర్తితో ఈ పాదయాత్ర జరగనుంది. ఈ ప్రదర్శనల్లో దండి మార్చి, మహాత్మ గాంధీ, నేతాజీ, పటేల్ సహా ఉద్యమ నాయకుల త్యాగాలను ప్రతిబింబించే కార్యక్రమాలు ఉంటాయి.