Vehicle Scrappage Policy : వాహనాల తుక్కు పాలసీ ప్రారంభించిన మోదీ
వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం శుక్రవారం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో(Investors Summit) వర్చువల్గా పాల్గొన్న మోదీ..ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
Vehicle Scrappage Policy వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో వెహికల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం శుక్రవారం నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సులో(Investors Summit) వర్చువల్గా పాల్గొన్న మోదీ..ఈ కొత్త విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశ అభివృద్ధి ప్రస్థానంలో వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ ఓ గొప్ప మైలురాయి అని చెప్పారు. ఇది చెత్త నుంచి సంపదను సృష్టించే పధకమని తెలిపారు. సరికొత్త స్టార్టప్లు ఈ రంగంలో వెలుస్తాయని, ముఖ్యంగా దేశంలో ఉన్న మధ్యతరగతికి ఈ పాలసీ వల్ల మేలు జరుగుతుందన్నారు. ఈ తుక్కు పాలసీ రూ.10 వేల కోట్ల పెట్టుబడులను తీసుకురానున్నట్లు ఈ సందర్భంగా మోదీ చెప్పారు.
వెహికిల్ స్క్రాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం గుజరాత్లో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సు విస్తృత అవకాశాలను తీసుకొస్తుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించే పనిలో భాగంగా కాలపరిమితి నిండిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు తెచ్చిన కొత్త పాలసీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని మోదీ అన్నారు. ఇకపై నిరుపయోగంగా ఉన్న వాహనాల్ని దశల వారీగా తగ్గించాలన్నారు. ఈ పని చేసేందుకు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయాంటూ యువతను ప్రధాని ఆహ్వానించారు. ఈ పాలసీ వల్ల దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు, రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు వీలవుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరైన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ..ఈ తుక్కు పాలసీ కారణంగా ముడి సరుకుల ధరలు 40 శాతం వరకూ తగ్గుతాయని అన్నారు. ఆటోమొబైల్ తయారీలో ఇండియా ఇండస్ట్రియల్ హబ్గా మారుతుందన్నారు. దేశంలో ఎటువంటి వ్యాలిడ్ ఫిట్నెస్ లేని వాహనాలు దాదాపు 1 కోటి వరకు ఉన్నాయన్నారు. వాహనం వయసునుబట్టి కాకుండా, దాని ఫిట్నెస్ ఆధారంగా ఈ స్క్రాపింగ్ పాలసీ వర్తిస్తుందన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలోని అన్ని జిల్లాల్లో టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు.
వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అంటే ఏంటీ
పాత, కాలుష్యానికి కారణమవుతున్న తమ వాహనాలను తుక్కు కింద మార్చడానికి ముందుకు వచ్చే యజమానులకు ఈ కొత్త విధానం కారణంగా లబ్ధి కలగనుంది. ఈ విధానంలో భాగంగా 15 ఏళ్లు పైబడిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు పైబడిన వ్యక్తిగత వాహనాలను తుక్కు చేయాల్సి ఉంటుంది. మొదట ఈ విధానాన్ని ప్రభుత్వ వాహనాలకు అమలు చేయనుండగా.. ఆ తర్వాత భారీ వాణిజ్య వాహనాలు, వ్యక్తిగత వాహనాలకు అమలు చేస్తారు. వచ్చే ఏడాది ఏప్రిల్లోగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న 15 ఏళ్లు పైబడిన వాహనాలను తుక్కుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యక్తిగత వాహనాలను 2024 జూన్ నుంచి తుక్కు చేయనున్నారు.
కాగా,ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆర్ధిక ప్రయోజనాలతో పాటు ఉపాధి కల్పన దిశగా వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రతిపాదించిన విషయం తెలిసిందే.