PM Modi : ఉభయ సభల ఫ్లోర్ లీడర్లతో రేపు ప్రధాని సమావేశం!
దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చిందేకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం(జులై-20,2021)ఉభయసభల ఫ్లోర్ లీడర్స్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
PM Modi దేశంలో కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చిందేకు ప్రధాని మోదీ మంగళవారం(జులై-20,2021)ఉభయసభల ఫ్లోర్ లీడర్స్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. లోక్సభ, రాజ్యసభలోని అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఈ సమావేశానికి హాజరుకానున్నారని.. దేశంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఈ సమావేశంలో ప్రధాని ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
మరోవైపు, ఇవాళ ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..తొలి రోజే విపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఉభయసభల్లో వరుస వాయిదాల పర్వం కొనసాగింది. ఓ దశలో ప్రధాని మోదీ కూడా విపక్ష సభ్యుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్లమెంటులో తొలిసారి పాత సంప్రదాయానికి విపక్షాలు తూట్లు పొడిచాయని రాజ్యసభ నాయకుడు పియూష్ గోయల్ ఆరోపించారు. కొత్త కేబినెట్ ఏర్పడినప్పుడు లేదా పునర్నిర్మాణం జరిగినప్పుడు మంత్రులను పార్లమెంటు సభ్యులకు ప్రధాని పరిచయం చేయడం మంచి సంప్రదాయమని అన్నారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు ఈ రోజు దీనికి అంతరాయం కలిగించారని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రజాస్వామ్య ప్రక్రియను నిలిపివేశారని గోయల్ ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు.
మొదటిసారిగా పెద్ద సంఖ్యలో మహిళలు, గిరిజనులు, ఈశాన్య ప్రజలు కేంద్ర మంత్రివర్గంలో భాగమయ్యారని గోయల్ తెలిపారు. సమాజంలోని వెనుకబడిన వర్గానికి చెందిన వారిని పెద్ద సంఖ్యలో ప్రధాని మోదీ తన కేబినెట్లోకి తీసుకోవడాన్ని ప్రతిపక్ష ఎంపీలు సహించలేకపోతున్నారని విమర్శించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు ప్రవర్తించిన విధానాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. రాజ్యసభలో చైర్మన్ ప్రసంగాన్ని కూడా విపక్షాలు అడ్డుకున్నాయని, ఇది చాలా దురదృష్టకరమని గోయల్ అన్నారు.