PM Modi : నేడు ప్రధాని మోదీ నేపాల్ పర్యటన..ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై చర్చలు
జలవిద్యుత్ ప్రాజెక్టులు, అభివృద్ధి, ఇరు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించిన రవాణా, మౌలిక వసతుల కల్పనవంటి అంశాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
PM Modi Nepal tour : నేపాల్తో బంధం మరింత బలోపేతం అయ్యేలా ప్రస్తుత ప్రభుత్వంతో కలసి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. నేపాల్తో బాంధవ్యం అసమానమైనదని కాలపరీక్షలో నెగ్గిన ఆత్మీయ బంధమని తెలిపారు. బుద్ధపూర్ణిమ సందర్భంగా ఇవాళ నేపాల్లోని లుంబిని బౌద్ధ క్షేత్రాన్ని మోదీ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన విడుదల చేశారు. తన పర్యటన సందర్భంగా నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బాతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతానని వెల్లడించారు.
గత నెలలో నేపాల్ ప్రధాని దేవ్బా భారత్ సందర్శించిన సమయంలో చర్చలు ఫలవంతమైనాయన్న విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. జలవిద్యుత్ ప్రాజెక్టులు, అభివృద్ధి, ఇరు దేశాల మధ్య రాకపోకలకు సంబంధించిన రవాణా, మౌలిక వసతుల కల్పనవంటి అంశాలలో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. శతాబ్దాల తరబడి ఇరు దేశాల మధ్య, ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు ధృడంగా మారాయన్న ఆయన వాటిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
India – Nepal: భారత్ నేపాల్ మధ్య దృఢమైన బంధం: రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
తన పర్యటన సందర్భంగా బుద్ధ జయంతి వేళ మాయాదేవి ఆలయంలో ప్రార్థనలు చేస్తానని, పవిత్ర బుద్ధుడి జన్మస్థలంలో భారతీయుల అందరి తరపున నివాళి అర్పిస్తానన్నారు. లుంబినిలో నేపాల్ ప్రధాని దేవ్బాతో ద్వైపాక్షిక అంశాలపై విస్తృత చర్చలు జరుపుతానని వెల్లడించారు. 2019 తరువాత ప్రధాని మోదీ నేపాల్లో పర్యటించడం ఇదే మొదటి సారి. 2014 నుంచి అయితే ఇది ఐదోసారి.