PM-Kisan scheme : రైతుల ఖాతాల్లోకి రూ. 18 వేల కోట్లు జమ
PM-Kisan scheme : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా ఈ వార్షిక సంవత్సరంలో చివరి విడత నిధుల పంపిణీ చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. లబ్ధిదారులుగా ఉన్న రైతుల ఖాతాల్లో 2020, డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం దేశవ్యాప్తంగా 2 వేల చొప్పున జమ చేసింది. క్రిస్మస్ రోజు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ..పీఎం-కిసాన్ నిధుల పంపిణీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో 18 వేల కోట్లు జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఇవి జమ కానున్నాయి.
ప్రతి ఏడాదిలో మూడు విడతలుగా, ఒక్కో విడతకు 2 వేల చొప్పున, ఏడాదికి 6 వేలు కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఏప్రిల్-జూలై మధ్యలో మొదటి విడత, ఆగస్టు నుంచి నవంబరు మధ్యలో రెండో విడత, డిసెంబరు నుంచి మార్చి వరకు మూడో విడత చెల్లింపులు చేస్తోంది. పీఎం-కిసాన్ పథకంలో లబ్ధిదారులుగా నమోదైన రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సెల్ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు.
మరోవైపు ఆరు రాష్ట్రాలకు చెందిన ప్రధాని మోదీ రైతులతో మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రైతులకు ప్రధాని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు.