లాక్ డౌన్ ఉన్నా.. వ్యాక్సినేషన్ స్పీడ్ కొనసాగాలి
దేశంలో కరోనా సంబంధిత పరిస్థితులపై గురువారం ప్రధాని నరేంద్ర మోడీ సమగ్ర సమీక్ష నిర్వహించారు.
PM Modi దేశంలో కరోనా సంబంధిత పరిస్థితులపై గురువారం ప్రధాని నరేంద్ర మోడీ సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ మీటింగ్ లో పాల్గొన్న కేంద్రహోంమంత్రి అమిత్ షా,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్,ఆర్థికమంత్రి నిర్మలాసీతారమన్,ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్,రైల్వే మంత్రి పియూష్ గోయల్ సహా పలువరు కేంద్రమంత్రులు,అధికారులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి ప్రజారోగ్య వ్యవస్థ స్పందిస్తున్న తీరుపై ప్రధాని ఆరా తీశారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలు, జిల్లాల పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు మోడీ. రాబోయే కొద్ది నెలల్లో టీకా ఉత్పత్తిని పెంచడానికి రోడ్మ్యాప్పై ప్రగతిని ప్రధాని సమీక్షించారు.
ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రాలకు అన్ని విధాలా సాయం చేస్తామని ఈ సందర్భంగా ప్రధాని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ కొనసాగుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్న ప్రధాని..కరోనా మందుల లభ్యతపైనా చర్చించారు.
ఇక,రాష్ట్రాలకు ఇప్పటివరకు 17.7 కోట్ల టీకాలు సరఫరా చేసినట్లు ప్రధానికి అధికారులు తెలియజేశారు. 45 ఏళ్లు పైబడిన అర్హత కలిగిన జనాభాలో.. 31 శాతం మందికి వ్యాక్సిన్ తొలి డోసు ఇచ్చినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం తగ్గకుండా రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు ప్రధాని. పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ఉన్నప్పటికీ పౌరులు టీకా పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. టీకా ప్రక్రియలో పాల్గొనే ఆరోగ్య కార్యకర్తలను ఇతర విధుల కోసం మళ్లించకూడదని ప్రధాని సూచించారు.