PM Modi ICRISAT : పటాన్‌చెరు ఇక్రిశాట్ గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు మధ్యాహ్నం పటానుచెరు లోని ఇక్రిశాట్‌కు రానున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెట్ట పంటల పరిశోధన సంస్థ "ఇక్రిశాట్" ఏర్పాటై ఈరోజుకు యాభై ఏండ్లు పూర్తవుతుంది.

PM Modi ICRISAT : పటాన్‌చెరు ఇక్రిశాట్ గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు ప్రధాని మోదీ

PM Narendra Modi ICRISAT

PM Modi ICRISAT  :  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు మధ్యాహ్నం పటానుచెరు లోని ఇక్రిశాట్‌కు రానున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మెట్ట పంటల పరిశోధన సంస్థ “ఇక్రిశాట్” ఏర్పాటై ఈరోజుకు యాభై ఏండ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవాలలో ప్రధానిపాల్గొని నూతన లోగోను ఆవిష్కరించి, అక్కడి శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్నారు.

సంగారెడ్డి జిల్లా పటానుచెరులో 1972‌లో ఏర్పాటైన ఈ సంస్థ 3,434 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రధానంగా ఇక్కడ కంది,జొన్న, వేరుసెనగ, సెనగ,సజ్జలు లాంటి వంద రకాల వంగడాలను ఆవిష్కరించింది. అంతే కాదు ఇటీవల కొత్తగా పోషకాహార భద్రత కల్పించే వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలపై పరిశోధనలు చేస్తోంది. ఇక్రిశాట్‌ను పటానుచెరు లోనే ఏర్పాటు చేయడం వెనుక జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో భారీ కసరత్తే జరిగింది.

రైతులకు మేలైన విత్తనాలు, నూతన సాగు రీతులను దగ్గరచేస్తూ ఆసియా,ఆఫ్రికా ఖండాలలో ఆహార సంక్షోభ నివారణకు ఈ పరిశోధనా సంస్థ ఇతోధికంగా సహాయపడుతోంది. రైతులకోసం ప్రత్యేకంగా అదీ అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు ఉన్నాయంటే మొదటిగా విన్పించే పేరు “ఇక్రిశాట్”. సైన్స్ విత్ హ్యుమన ఫేస్ నినాదంతో యాభై అయిదు దేశాల రైతులకు అండగా నిలుస్తోంది.

సరైన వర్షపాతం లేని ఆసియా,ఆఫ్రికా ఖండాల్లోని దేశాలకు ఇతోధికంగా సహయపడుతోంది. పోషకాహారం,ఆహార భద్రత లక్ష్యంగా నూతన వంగడాలను సృష్టించి ఆయా దేశాలకు అందిస్తోంది. ఒక్కో వంగడం పరిశోధనలు ముగించుకొని రైతుల చెంతకు చేరడానికి ఎంత లేదన్నా దశాబ్ద కాలం పడుతుంది. కానీ ఇక్రిశాట్‌లో గత ఏడాది “ర్యాపిడ్ జెన్ కేంద్రం”ను ఏర్పాటు చేసి నూతన వంగడాలను ఏడాదిన్నర లోపే అందివ్వగలుగుతున్నారు.
Also Read : Mobile Snatchers : రెచ్చిపోయిన మొబైల్ స్నాచర్స్
మొత్తంగా ఆసియా,ఆఫ్రికా ఖండాల్లో సరైన వర్షపాతం లేని,ఉష్ణ మండల ప్రాంత సన్న,చిన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం అదే సమయంలో ఆహార భద్రతకు తన వంతు సహకారాన్ని అందివ్వడం లక్ష్యం గా పెట్టుకుంది ఇక్రిశాట్. గత ఐదు దశాబ్దాలుగా నిరంతర పరిశోధనలతో సమాజ వికాసానికి తోడ్పాటు అందిస్తున్న ఈ సంస్థ స్వర్ణోత్సవాల వేళ ప్రధాని రానుండటంతో ఇక్రిశాట్ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.