కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మోడీ తల్లి

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న మోడీ తల్లి

modi mother దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. మార్చి 1న రెండో విడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం నాటినుంచి ప్రతిరోజూ లక్షలాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. 60 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల వయోధిక వృద్ధులు, 45 సంవత్సరాలకు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతోన్న వారికి రెండో దశలో కరోనా వ్యాక్సిన్‌ను అందజేస్తోన్నారు.

తాజాగా ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ త‌ల్లి హీరాబెన్ మోడీ కరోనా వ్యాక్సిన్‌ను తీసుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ఆమెకు వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఈ విష‌యాన్ని ప్రధాని మోడీ ట్విట‌్టర్ ద్వారా వెల్లడించారు. మా అమ్మ ఈ రోజు కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. వ్యాక్సిన్‌కు అర్హత కలిగిన మీ చుట్టు పక్కల వారిని వ్యాక్సిన్ తీసుకునేలా అందరూ ప్రోత్సహించాలని సూచిస్తున్నానంటూ మోడీ ట్వీట్‌ చేశారు. కాగా, రెండో దశ వ్యాక్సినేషన్ ప్రారంభించిన రోజే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫస్ట్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆయ‌న హైద‌రాబాద్ సంస్థ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కోవ్యాక్సిన్‌ను తీసుకున్నారు.

ఇక, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధనకర్ కూడా ఇవాళే తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మరోవైపు,దేశ‌వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 2,52,89,693 కి చేరినట్లు గురువారం కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. గ‌త 24 గంట‌ల్లో 9.2 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు పేర్కొంది.