కెమెరా సాక్షిగా : ఫరీదాబాద్ పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు

  • Published By: madhu ,Published On : May 13, 2019 / 07:02 AM IST
కెమెరా సాక్షిగా : ఫరీదాబాద్ పోలింగ్ బూత్ లో దొంగ ఓట్లు

పోలింగ్ కేంద్రంలో మహిళలు ఓటు వేయకుండా అడ్డుకుని.. వారి ఓట్లను తానే వేశాడు ఏజెంట్. ఇదంతా కెమెరాలో రికార్డ్ కావటం కలకలం రేపుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావటంతో.. హర్యానా ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. ఇతడిని అరెస్టు చేసింది. మే 12వ తేదీ ఆదివారం ఆరో విడత పోలింగ్ జరిగింది. హర్యానాలోని ఫరీదాబాద్ నియోజకవర్గంలో అసౌటిలో పోలింగ్ జరుగుతోంది.

అక్కడ ఓ ఏజెంట్ కూర్చొన్నాడు. ఓటర్లు వస్తున్నారు. ఈవీఎం కంపార్ట్‌మెంట్ దగ్గరకు వెళ్లి.. అక్కడ మహిళ ఉండగానే ఆమె ఓటును అతడు వేశాడు.. ఇలా ఒక్కరిది కాదు.. ఏకంగా ముగ్గురు ఓట్లు వేశాడు. ఇంత జరుగుతున్న అక్కడున్న అధికారులు ఏమీ అనలేదు. ఏజెంట్ దొంగ ఓట్లు వేస్తున్న సమయంలో రహస్యంగా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. క్షణాల్లో ఇది వైరల్ అయ్యింది. ఫరీదాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రెస్పాండ్ అయ్యారు.

ఆ పోలింగ్ ఏజెంట్ ఎవరో గుర్తించారు. ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. FIR నమోదు చేశారని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఇతడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.