సీబీఐ తాత్కాలిక చీఫ్ గా ప్రవీణ్ సిన్హా
Praveen Sinha కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తాత్కాలిక చీఫ్గా గుజరాత్ కేడర్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సిన్హా గురువారం బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డైరెక్టర్గా ఆర్ కే శుక్లా రెండేళ్ల పదవీకాలం బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే. 1983 బ్యాచ్ మధ్యప్రదేశ్ కేడర్ కు చెందిన శుక్లా 2019 జనవరిలో సీబీఐ డైరక్టర్ గా బాధ్యతలు చేపట్టగా..బుధవారం ఆయన పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో సీబీఐ తాత్కాలిక చీఫ్ గా ప్రవీణ్ సిన్హాను నియమిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్శనల్ అండ్ ట్రెయినింగ్(DoPT)ఓ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
మరికొద్ది వారాల పాటు సిన్హా సీబీఐ తాత్కాలిక చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. 1988 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన సిన్హా.. ఎస్పీ, డీఐజీ, జాయింట్ డైరెక్టర్గా వివిధ విభాగాల్లో విధులు నిర్వహించారు. 2015-18 మధ్య సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు అదనపు కార్యదర్శిగా కూడా సిన్హా పనిచేశారు.
బాంబు పేలుళ్లు, ఆర్థిక నేరాలు వంటి కీలక కేసుల దర్యాప్తులో సిన్హా ముఖ్య పాత్ర పోషించారని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్.సి.జోషి తెలిపారు. 2017లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, 2020లో సీబీఐ (క్రైమ్)ల నియమ నిబంధనలు రూపొందించడంలో ఆయన పాత్ర ఎనలేనిదని పేర్కొన్నారు. సంస్కరణలు చేపట్టేందుకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆధ్వర్యంలో నడిచే వివిధ కమిటీలలో సిన్హా భాగస్వాములని జోషి తెలిపారు. నేర చట్టాలలో సంస్కరణలు చేపట్టేందుకు హాంశాఖ నేతృత్వంలోని కమిటీలో కూడా ఆయన భాగమని తెలిపారు.