డిసెంబర్ నాటికి బెంగాల్ లో రాష్ట్రపతి పాలన
President’s Rule to be imposed in West Bengal మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్ లో రాజకీయం ఇప్పుడే వేడెక్కింది. ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని బీజేపీ…చిత్తు చిత్తుగా బీజేపీని ఓడించి తన సత్తా చూపించాలని మమత నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ తమ అమ్ములపొదిలోని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి. వ్యక్తిగత దూషణల పర్వం కూడా కొనసాగుతోంది.
మరోవైపు గవర్నర్ వ్యవహారం కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ వర్సెస్ మమతగా కూడా బెంగాల్ రాజకీయం మారిపోయింది. రాష్ట్రంలో శాంతి, భద్రతలు గాడితప్పాయని,పోలీసులు అధికార టీఎంసీ క్యాడర్గా పని చేస్తున్నారని ఇటీవల గవర్నర్ తీవ్ర విమర్శ లు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించకపోతే తానే రంగంలోకి దిగాల్సి వస్తుందని, ఆర్టికల్ 154ను పరిశీలించాల్సి వస్తుందని గవర్నర్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ నాటికి వెస్ట్ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించనున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు,ఎంపీ సౌమిత్రా ఖాన్ సంచలన వ్యాఖ్యాలు చేశారు. మంగళవారం(అక్టోబర్-20,2020)రాత్రి బంకురా జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులను ఖండించిన ఆయన…బీజేపీ కార్యకర్తలను హత్య చేయడం రోజువారీ కార్యక్రమంలా మారిందని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో శాంతి, భద్రతలు పూర్తిగా గాడి తప్పాయని అన్నారు. డిసెంబర్ నాటికి బెంగాల్ లో రాష్ట్రపతి పాలన వస్తుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా అంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సౌమిత్ర వ్యాఖ్యలను టీఎంసీ దీటుగా తిప్పికొట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి అపకీర్తి కలిగించేలా బీజేపీ శాంతి, భద్రతల అంశాన్ని లేవనెత్తుతోందని… వామపక్షాల హయాంలోని పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు రాష్ట్రంలో శాంతి, భద్రతలు మెరుగ్గా ఉన్నాయని… చట్టబద్ధ పాలన పాలన కనుమరుగైన ఉత్తర్ప్రదేశ్, గుజరాత్పై బీజేపీ నేతలు దృష్టిసారించాలని సౌగత రాయ్, టీఎంసీ ఎంపీ హితవు పలికారు.
కాగా, బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ విజయవర్గియా, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.