BJP Foundation Day : కార్యకర్తలు హనుమంతుడిలా పనిచేయాలి : ప్రధాని మోదీ

ఢిల్లీలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ..కార్యకర్తలు హనుమంతుడి స్పూర్తితో పనిచేయాలని పిలుపునిచ్చారు.

BJP Foundation Day : కార్యకర్తలు హనుమంతుడిలా పనిచేయాలి : ప్రధాని మోదీ

BJP Foundation Day

BJP Foundation Day :  ఢిల్లీలో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బీజేపీ ఎదుగుదలలో ఎంతోమంది కృషి ఉందని బీజేపీ కార్యకర్తలు తలచుకుంటే ఏమైనా సాధించగలరు అంటూ క్యాడర్ ను పొగడ్తలతో ముంచేశారు మోదీ. బీజేపీ కార్యకర్తల కృషికి నిదర్శనమే ఈరోజు పార్టీ విజయకేతనాలు అంటూ ప్రశంసించారు. బీజేపీ కార్యక్తలు నిస్వార్థంతో పనిచేస్తారని కితాబిచ్చారు ప్రధాని మోడీ. కార్యకర్తలు హనుమంతుడిలా పనిచేయాలని అటువంటి కార్యకర్తలు బీజేపీ పార్టీకి బలమైనవారుగా ఉన్నారని ఈ సందర్భంగా పార్టీ క్యాడర్ గురించి చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ. పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ బీజేపీ విజయాలను గుర్తు చేసుకున్నారు. నేతలకు…క్యాడర్ కు దిశానిర్ధేశం చేశారు. బీజేపీ పురోగతిలో ఎందరో నేతల త్యాగాలున్నాయని వారి త్యాగాలను ప్రతీ ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని..అటువంటి అంకిత భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

అవినీతి, బంధుప్రీతికి బీజేపీ దూరం అని తెలిపారు. జన్‌సంఘ్‌ ఆవిర్భవించినప్పుడు దానికి పెద్దగా రాజకీయ అనుభవం లేదని..తగినంత వనరులు లేవన్నారు. కానీ ఉన్నదల్లా మాతృభూమి పట్ల భక్తి, ప్రజాస్వామ్యం శక్తి ఉందన్నారు. కానీ ప్రతీ ఒక్కరు నిబద్ధతో పనిచేయటం వల్ల.. బీజేపీ దేశంలో కొత్త రాజకీయ సంస్కృతికి నాయకత్వం వహిస్తోందని ఈ సందర్భంగా ప్రధాని అన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనేది పార్టీకి మంత్రమని అదే లక్ష్యమని వెల్లడించారు. బీజేపీ బలమైన శక్తిగా ఆవిర్భవించానికి కార్యకర్తల అమూల్యమైన అద్భుతమైన కృషేనని..పార్టీ కార్యకర్తల సేవ, త్యాగాలను పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో గుర్తు చేశారు.

దేశంలో అవినీతి, వంశపారంపర్య రాజకీయాలపైనా పోరాడేందుకు భాజాపా కట్టుబడి ఉందన్నారు. అటువంటి రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టంచేశారు. బీజేపీకి స్వార్ధరాజకీయాలు చేయాల్సిన పనిలేదని ఎందుకంటే తరువాత తరంవారిని అందలం ఎక్కించాలనే ఆకాంక్షలు లేవని..పార్టీకి అన్నింటికన్నా దేశమే ముఖ్యమని ఇదే బీజేపీ ముఖ్య ఉద్దేశమని స్పష్టంచేశారు మోదీ.

హనుమంతుడు ఏ పనినైనా చేయగలడని..హనుమంతుడు ఏ పని చేసినా దాంట్లో తనకంటూ ఎటువంటి స్వార్థం ఉండని అంతటి నిస్వార్థపరుడైన హనుమంతుడిని బీజేపీ కార్యకర్తలు ప్రేరణగా తీసుకుని పార్టీ అభ్యున్నతికి పనిచేయాలని సూచించారు మోదీ. బీజేపీ కూడా హనుమండులాగానే దేశం కోసమే పనిచేస్తుందన్నారు. హనుమంతుడు పాటించిన విలువలు, బోధనల నుంచి బీజేపీ కార్యకర్తలు నిరంతరం ప్రేరణ పొందుతారని తెలిపారు ప్రధాని మోదీ.