మోడీ దుర్యోధనుడిలా తయారయ్యాడు: ప్రియాంక

మోడీ దుర్యోధనుడిలా తయారయ్యాడు: ప్రియాంక

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోడీ అహంకారంతో నిండిపోయి దుర్యోధనుడిలా తయారైయ్యారని విమర్శించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై మోడీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. హర్యానాలోని అంబాలా ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక గాంధీ మోడీ వ్యాఖ్యలపై ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. 

‘దేశం అహంకారాన్ని ఎప్పుడూ సహించలేదు. దుర్యోధనుడు అహంకారం వల్లనే నాశనమైయ్యాడు. కృష్ణుడు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించినా పెడచెవిన పెట్టాడు. ఒకరిని నాశనం చేయాలని చూస్తే ముందు వారి విచక్షణ జ్ఞానం నాశనమవుతోంది. బీజేపీ ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయారు. చేసిన పనులు చెప్పి ఓట్లు అడగకుండా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీని తప్పుగా అభివర్ణిస్తూ ఓట్లు అడుగుతున్నారు’ అని ఎద్దేవా చేశారు. 

మే 4న ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో నరేంద్రమోడీ.. రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ ‘ మీ తండ్రి మిస్టర్ క్లీన్‌గా దేశ రాజకీయాల్లో వచ్చారు. కానీ నంబర్ వన్ అవినీతిపరుడిగా జీవితం ముగించారు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

ప్రియాంక గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన అమిత్ షా.. మీరు వ్యాఖ్యానించినంత మాత్రాన ఎవ్వరూ దుర్యోధనులు అయిపోరు. మే23న దుర్యోధనుడెవరు.. అర్జునెడవరు తెలిసిపోతుందంటూ సమాధానమిచ్చారు.