పోటీకి ప్రియాంక సై : రాహుల్ ప్లేస్ మారుస్తారా ?

  • Published By: madhu ,Published On : March 28, 2019 / 01:19 AM IST
పోటీకి ప్రియాంక సై : రాహుల్ ప్లేస్ మారుస్తారా ?

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమనే సంకేతాలిచ్చారు. యూపీలో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె అమేథీకి వచ్చారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగినప్పుడు.. పోటీపై ఇంకా నిర్ణయించుకోలేదని.. పార్టీ కోరితే తప్పనిసరిగా పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ కోసం పనిచేయాలన్నదే తన కోరిక అని ప్రియాంక తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రియాంక. ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ ప్రాంతాల్లో జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. 

కార్యకర్తలు తాను పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారని ప్రియాంక తెలిపారు. దీనిపై ఏం నిర్ణయం తీసుకోలేదని… ఒకవేళ పార్టీ అధిష్టానం కోరుకుంటే కచ్చితంగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో తాను ఇటువైపుగా అడుగులు వేశానని తెలిపారు. మరోవైపు దక్షిణాది నుంచి పోటీ చేయాల్సిందిగా కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మీద ఒత్తిడి పెరుగుతోంది. ఆయన ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోనూ పోటీ చేయనున్నారని ఇటీవల కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే ప్రియాంకను ఈ ఎన్నికల బరిలోకి దింపి రాహుల్‌ను దక్షిణాది నుంచి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉన్నట్లు సమాచారం.