ఇస్రో తొలి కమర్షియల్ శాటిలైట్ పీఎస్ఎల్వీ-సీ51 లాంచింగ్ నేడే..
Isro PSLV-C51: పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ నింగిలోకి దూసుకుపోయే సమయం ఆసన్నమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ఆదివారం ఉదయం 10గంటల 24 నిమిషాలకు లాంచింగ్ చేయాలని ముహూర్తం ఖరారుచేశారు. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభించింది.
లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ మొదలైంది. శనివారం లిక్విడ్ ఫ్యూయెల్ నింపి రాకెట్లోని ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ వ్యవస్థలను అలర్ట్ చేసే ప్రక్రియను చేపట్టారు.
పీఎస్ఎల్వీ-సీ51 ద్వారా భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన సతీష్ ధవన్ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్ శాట్, జీహెచ్ఆర్సీఈ శాట్, బ్రెజిల్ దేశానికి చెందిన అమెజానియా–1 ఉపగ్రహం(637 కిలోల బరువు), అమెరికాకు చెందిన స్పేస్ బీస్ శాటిలైట్ శ్రేణిలో 12, సాయ్–1 నానో కాంటాక్ట్–2 శాటిలైట్లు, న్యూ స్పేస్ ఇండియాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు.
తిరుపతి మెట్లెక్కిన ఇస్రో ఛైర్మన్:
ప్రయోగానికి ఒకరోజు ముందు ఇస్రో చైర్మన్ శివన్ శనివారం తిరుమలలోని శ్రీవారిని, శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడిని, సూళ్లూరుపేటలోని చెంగాళమ్మను దర్శించుకున్నారు. దేవుడి పాదాల వద్ద రాకెట్ నమూనా ఉంచి పూజలు జరిపించారు. ఉపగ్రహాల బరువు తక్కువగా వుండడంతో.. ఈ ప్రయోగాన్ని రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో రెడీ చేసినట్లు తెలిపారు. భారత ప్రైవేట్ సంస్థలతో కలిసి చేస్తున్న తొలి ప్రయోగమని వెల్లడించారు.