Arvind Kejriwal : పంజాబ్ ఎన్నికల్లో ఆప్ గెలిస్తే ‘ఫ్రీ’ కరెంట్
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చూపించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు.
Arvind Kejriwal వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చూపించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టే లక్ష్యంతో వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేలా హామీలను ఇస్తూ ముందుకెళ్తున్నారు కేజ్రీవాల్.
మంగళవారం చండీఘర్ లో పర్యంటిన కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల 80 శాతం కుటుంబాలకు లబ్ది జరుగుతుందని,వాళ్లు ఒక్క రూపాయి కరెంట్ బిల్లు కూడా చెల్లించాల్సిన అవసరముంటుందని కేజ్రీవాల్ చెప్పారు. అంతేకాకుండా ప్రస్తుతం పెండింగ్లో ఉన్న అన్ని కరెంటు బిల్లులు మాఫీ చేస్తామని, రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అందించే దిశగా పనిచేస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.
2013లో ఆప్ తొలిసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలోనూ అప్పటి ప్రభుత్వ హయాంలో భారీగా కరెంటు బిల్లులు వచ్చేవని కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్ మాదిరిగా అప్పటి ప్రభుత్వం కరెంటు కంపెనీలతో ప్రభుత్వాలు కుమ్మక్కవడంలో ఈ పరిస్థితి ఉండేదని అన్నారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో తమ ప్రభుత్వం అతి తక్కువ రేటుకి 24 గంటల కరెంట్ అందిస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. పంజాబ్ లో కూడా తాము ఇలాగే చెయ్యాలనుకుంటున్నామని కేజ్రీవాల్ తెలిపారు.
కాగా,2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 117 స్థానాలకు గాను 20 స్థానాల్లో ఆప్ విజయం సాధించిన విషయం తెలిసిందే.