Punjab Congress : సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే… సోనియాకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఫిర్యాదు..!
Punjab Congress : పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Sidhu)పై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.
Punjab Congress : పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Sidhu)పై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ఏఐసీసీ ఇన్ఛార్జ్ హరీష్ చౌదరి పార్టీ అధినేత్రి సోనియా గాంధీని లేఖలో కోరారు. ఏప్రిల్ 23న సిద్ధూపై ఫిర్యాదు చేస్తూ ఆయన సోనియాకు లేఖ రాశారు. గత ఏడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు పంజాబ్ ఇన్ఛార్జ్గా హరీష్ చౌదరీ పరిశీలించిన అంశాలను లేఖలో ప్రస్తావించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ సిద్ధూ విమర్శించేవారని, శిరోమణి అకాలీదళ్కు మద్దతు తెలిపేవారని హరీష్ చౌదరి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ సిద్ధూ తీరు వివాదస్పదంగా మారిందని ఆరోపించారు. ఎంతగా వారించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిద్ధూ వ్యతిరేస్తూనే వచ్చారని లేఖలో తెలిపారు. సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు వెంటనే తీసుకోవాలని సోనియా గాంధీని ఆయన కోరారు.
ప్రస్తుతం సిద్ధూ చేసే కార్యక్రమాలకు సంబంధించి పంజాబ్ కాంగ్రెస్ కొత్త చీఫ్ రాజా వారింగ్ ద్వారా నోట్ను కూడా సోనియాకి పంపినట్లు పంజాబ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ హరీష్ చౌదరి మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సిద్ధూ ఇలానే మాట్లాడుతుంటే క్రమశిక్షణ ఉల్లంఘించడమే అన్నారు. సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అనే విషయంలో ఆయన్ను నుంచి వివరణ కోరాలని సోనియాకు రాసిన లేఖలో హరీష్ చౌదరీ తెలిపారు. చివరిగా పార్టీ అంతర్గత వ్యవహారమంటూనే హారీష్ మాట దాటవేశారు.
Read Also : Basavaraj Bommai: కర్ణాటక సీఎంను మారుస్తారా?