punjab App Govt : పంజాబ్లో ఆప్కు షాక్ ఇచ్చిన గవర్నర్ .. ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి అనుమతి నిరాకరణ
పంజాబ్ లో ఆప్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఎం భగవంత్ మాన్కు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకిచ్చారు. మాన్ సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు గురువారం (సెప్టెంబర్ 21,2022)అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలన్న ప్రభుత్వ అభ్యర్థనను గవర్నర్ తిరస్కరించారు.
punjab App Govt : పంజాబ్ లో ఆప్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఎం భగవంత్ మాన్కు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకిచ్చారు. మాన్ సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు గురువారం (సెప్టెంబర్ 21,2022)అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలన్న ప్రభుత్వ అభ్యర్థనను గవర్నర్ తిరస్కరించారు. ఇందుకు నిర్దిష్టమైన నిబంధనలు లేని కారణంగా ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నట్టు గవర్నర్ పేర్కొన్నారు. పంజాబ్ లో బీజేపీ ఆపరేషన్ లోటస్ అమలు చేస్తోంది అంటూ ఆప్ ఆరోపించింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.20నుంచి 25 కోట్లు బీజేపీ ఆఫర్ చేసిందంటూ ఆప్ ఆరోపించింది.
ఇదిలా ఉండగా..సీఎంపై విపక్షాలు ఆరోపణల చేస్తున్న క్రమంలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సెషన్ ని నిర్వహించాలని ప్రభుత్వం కోరింది. మాన్ జర్మనీ వెళ్లి తిరిగి ఇండియాకు వస్తున్న సందర్భంగా ఆయనను లుఫ్తాన్సా విమాన సిబ్బంది దింపివేశారని, ఆ సమయంలో ఆయన మద్యం తాగి ఉన్నారని వార్తలు వచ్చాయి. దీంతో శిరోమణి అకాలీదళ్ వంటి విపక్షాలు సీఎంపై ఆరోపణలు గుప్పించాయి. ఈ కారణంగానే మాన్ ప్రభుత్వం విశ్వాస పరీక్షకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా..మాట్లాడుతూ మీరు మెజారిటీ నిరూపించుకోవాలని ఎవరూ కోరలేదని..ఈ కాఫిడెన్స్ షో ద్వారా మీరు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేరని ఎద్దేవా చేశారు.
మీరు చేసే అనాలోచిన చర్యలవల్ల విశ్వాసాన్ని కోల్పోయారని విమర్శించారు. ఈక్రమంలో ముందుస్తు జాగ్రత్త అనుకుందో ఏమోగానీ ప్రభుత్వం శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించి ఆమోదించింది. పైగా రాష్ట్రంలో 6 నెలల ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 10 మంది అధికార ఆప్ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ 25 కోట్ల చొప్పున ముడుపులు ఇవ్వజూపుతోందని వస్తున్న వార్తలు కూడా కేబినెట్ ని ఆందోళనకు గురి చేశాయని తెలుస్తోంది. ఈక్రమంలో తమపై తామే విశ్వాసపరీక్ష పెట్టుకుంది ఆప్ ప్రభుత్వం.
కాగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే తమ బలాన్ని నిరూపించుకోవటం రాజకీయాల్లో సాధారణంగా జరుగుతుంటుంది. కానీ తమకు తామే విశ్వాస ఏర్పాటు చేసుకుని బలాన్ని నిరూపించుకోవటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే దీన్నో ట్రెండ్ గా మార్చాలనుకున్న ఆప్ ప్రభుత్వానికి గవర్నర్ షాక్ ఇచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అడుగుజాడల్లో నడవాలనుకున్న సీఎం భగవంత్ మాన్ ఆశలు నెరవేరలేదు. విశ్వాస పరీక్ష కోసం ఉద్ధేశించిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి గవర్నర్ అనుమతి నిరాకరించారు.