Punjab fuel Prices : పెట్రోల్,డీజిల్ రేట్లను భారీగా తగ్గించిన పంజాబ్
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో లీటరు పెట్రోల్పై రూ.10, లీటరు డీజిల్పై రూ.5
Punjab fuel Prices: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లో లీటరు పెట్రోల్పై రూ.10, లీటరు డీజిల్పై రూ.5 తగ్గించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ ఆదివారం ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ పై ఈ తగ్గింపు ఆదివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తుందని తెలిపారు. గడిచిన 70ఏళ్లలో ఇంధన ధరలను ఈ స్థాయిలో తగ్గించడం ఇదే మొదటిసారని సీఎం చన్నీ తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్ లోనే ఇంధన ధరలు తక్కువగా ఉన్నాయన్నారు. ఢిల్లీలో కంటే తమ రాష్ట్రంలో పెట్రోల్ రూ.9 తక్కువగా ఉందన్నారు.
పంజాబ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. రైతులు వ్యవసాయ అవసరాల కోసం వినియోగించే ట్రాక్టర్లు, ఇతర వాహనాలు పెద్ద ఎత్తున డీజిల్ను వాడుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చరణ్జిత్ సింగ్ ఛన్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
కాగా, దేశవ్యాప్తంగా కొన్ని నెలల పాటు భారీగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక్కసారిగా తగ్గాయి. దీపావళి పండగను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్ పై5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులకు కొంత మేర ఊరట కలిగించింది.
అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి. ఎక్సైజ్ సుంకానికి అనుగుణంగా వ్యాట్ పెంచేసిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు దానిని తగ్గించే పనిలో పడ్డాయి. కర్ణాటక, అసోం, గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఒడిశా తదితర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్పై ఇప్పటికే వ్యాట్ను తగ్గించాయి. అయితే ఆయిల్ ధరలను తగ్గించిన రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించడానికి ఆసక్తి చూపట్లేదు.
ALSO READ Siliguri Corridor : సిలిగురి కారిడార్ పై చైనా కన్ను..చుంబీ వ్యాలీలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం!