జైలు నుంచే విద్వంసానికి భారీ స్కెచ్.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

  • Published By: vamsi ,Published On : September 15, 2020 / 01:55 PM IST
జైలు నుంచే విద్వంసానికి భారీ స్కెచ్.. ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్

కరోనా కష్ట సమయంలో దేశం మొత్తం బతుకు జీవుడా అన్నట్లుగా బతికితే చాలు అని అనుకుంటుంటే.. ఉగ్రవాదులు మాత్రం ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరిగేలా చెయ్యాలి అనేదానిపై భారీ స్కెచ్‌లు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పంజాబ్‌లో ఇద్దరు ఖలీస్తాన్ ఉగ్రవాదులను ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు.




రాజ్‌పురా సమీపంలోని రాజ్‌పురా-సిర్హింద్ రహదారిపై వారిని పట్టుకున్నారు. పంజాబ్‌లో ఉగ్రవాదులు పెద్ద కుట్రకు ప్లాన్ చెయ్యగా.. పసిగట్టిన పోలీసులు వారిని పట్టుకున్నారు. పంజాబ్‌లో ఉగ్రవాదులను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రచారం నిర్వహిస్తున్నారని పంజాబ్ డిజిపి దింకర్ గుప్తా చెప్పారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులను పట్టుకున్నారు. ఈ ఉగ్రవాదులు ఇద్దరూ టార్న్ తరణ్ జిల్లాలోని మియాన్పూర్ గ్రామానికి చెందిన హర్జీత్ సింగ్ అలియాస్ రాజు మరియు షంషేర్ సింగ్ అలియాస్ షెరాగా గుర్తించారు.

వారి నుంచి 9 ఎంఎం పిస్టల్, నాలుగు .32 క్యాలిబర్ పిస్టల్స్ మరియు ఒక .32 రివాల్వర్, ఎనిమిది గుళికలు మరియు పేలుళ్లు, అనేక మొబైల్ ఫోన్లు మరియు ఇంటర్నెట్ డాంగిల్ స్వాధీనం చేసుకున్నట్లు డిజిపి తెలిపారు. ఈ ఉగ్రవాదులు పంజాబ్‌లో పెద్ద ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ ఉగ్రవాదులు ఖలీస్తాన్ జిందాబాద్ ఫోర్స్ (కెజెడ్ఎఫ్) తో సంబంధాలు కలిగియున్నారు. అమృత్‌సర్ జైలులో ఐదుగురు KJF ఉగ్రవాదుల ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. వీరి అరెస్టు పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాల గురించి పెద్ద సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.



పంజాబ్‌లో ఖలీస్తానీ ఉగ్రవాదులు నిరంతరం పట్టుబడుతున్నట్లుగా పంజాబ్‌లో శాంతి, సామరస్యాన్ని దెబ్బతీసేందుకు పాకిస్తాన్‌తో అనుసంధానమైన ఉగ్రవాద సంస్థలు, గ్రూపుల దుర్మార్గపు ప్రణాళికలు బయటపడ్డాయని డీజీపీ గుప్తా చెప్పారు. ఈ ఉగ్రవాదులు పంజాబ్‌లో హింసను వ్యాప్తి చేయాలని, మత సామరస్యాన్ని దెబ్బతీయాలని భావించినట్లు చెబుతున్నారు.
https://10tv.in/rhea-named-sara-ali-khan-rakul-preet-during-investigation-admits-ncb/
ప్రాథమిక విచారణలో ఇద్దరు ఉగ్రవాదులు పలు విషయాలు వెల్లడించారని డీజీపీ గుప్తా తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ నుంచి నాలుగు, హర్యానాలోని జింద్ సఫీదా నుంచి రెండు ఆయుధాలను అందుకున్నట్లు ఉగ్రవాదులు వెల్లడించారు. ఆయుధాల నిరోధక చట్టం, ఆయుధాల చట్టం కింద వారిపై కేసులు పెట్టారు. టార్న్ తరణ్‌లోని సరై అమానత్ కలన్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులపై హత్య కేసు కూడా నమోదైనట్లు డీజీపీ తెలిపారు.




అమృత్‌సర్ జైలులో ఐదుగురు KJF ఉగ్రవాదులు అమృత్‌పాల్ సింగ్, శుభదీప్ సింగ్ అలియాస్ శుబ్, రణదీప్ సింగ్, గోల్డీ, అశుల ఆదేశాల మేరకు ఈ ఉగ్రవాదులు పంజాబ్‌లో ఒక పెద్ద ఉగ్రవాద చర్యకు సిద్ధమైనట్లు ప్రాథమిక విచారణలో తేలిందని డిజిపి గుప్తా చెప్పారు.