Gehlot vs Pilot : రాజస్తాన్ పై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్
పంజాబ్లో నవజోత్ సింగ్ సిద్ధూ- అమరీందర్ సింగ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తగ్గించి సయోధ్య కుదిర్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తన దృష్టిని రాజస్తాన్ పై కేంద్రీకరించింది.
Gehlot vs Pilot పంజాబ్లో నవజోత్ సింగ్ సిద్ధూ- అమరీందర్ సింగ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తగ్గించి సయోధ్య కుదిర్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తన దృష్టిని రాజస్తాన్ పై కేంద్రీకరించింది. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్-మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మద్య వివాదాలను పరిష్కరించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్,రాజస్తాన్ కాంగ్రెస్ ఇంచార్జి అజయ్ మాకెన్ శనివారం జైపూర్ చేరుకొని సీఎం గెహ్లాట్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ఇక త్వరలోనే రాజస్తాన్ లో మంత్రివర్గ విస్తరణ ఉందన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతాస్రా ఆదివారం ఉదయం 25మంది ఎమ్మెల్యేల సమావేశానికి పిలుపునిచ్చారు. సచిన్ పైలట్ కూడా తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఈ సమావేశానికి హాజరయ్యారు. తన వర్గంలోని కొంతమందిని కేబినెట్ లోకి తీసుకోవాలని సచిన్ పైలట్ ఈ సమావేశంలో డిమాండ్ చేసినట్లు సమాచారం. ఈ మీటింగ్ కి అజయ్ మాకేన్,కేసీ వేణుగోపాల్ కూడా హాజరయ్యారు.
సమావేశం అనంతరం అజయ్ మాకెన్ మాట్లాడుతూ..కేబినెట్ విస్తరణ,జిల్లా మరియు బ్లాక్ స్థాయిల్లో కాంగ్రెస్ చీఫ్ ల నియామకం గురించి మరియు బోర్డులు మరియు కార్పొరేషన్లలో కాంగ్రెస్ నేతల నియామకం గురించి చర్చిస్తున్నాం. నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని సమావేశంలో ప్రతి ఒక్కరూ చెప్పారు. కేబినెట్ విస్తరణ నిర్ణయం గురించి తర్వలోనే ప్రకటించనున్నట్లు మాకెన్ తెలిపారు. ఎమ్మెల్యేల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు మరికొద్ది రోజుల్లోనే తిరిగి రాజస్తాన్ కి వస్తానని మాకెన్ తెలిపారు.
కాగా, గతేడాది 18మంది ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్..కాంగ్రెస్ హైకమాండ్ పై తిరుగుబావుటూ ఎగురువేసిన విషయం తెలిసిందే. సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో ఢిల్లీ శివార్లలోని ఓ హోటల్ లో కొద్ది రోజులు మకాం వేసిన విషయం తెలిసిందే. ఓ దశలో సచిన్ పైలట్ బీజేపీతో టచ్ లోకి వెళ్లినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సచిన్ పైలట్ కొద్దిగా మొత్తబడ్డారు. అయితే తాను లేవనెత్తిన సమస్యలపై కాంగ్రెస్ తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఇటీవల సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానంతో టచ్లో ఉన్నట్లు తెలిపారు. మంత్రివర్గ విస్తరణ అంశం సహా సచిన్ పైలట్ లేవనెత్తిన సమస్యలను హైకమాండ్ నెరవేరుస్తదని పైలట్ క్యాంప్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు.