రేపే వాయుసేనలోకి ‘రఫెల్ చేరిక’…ముఖ్య అతిధిగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి
జులై నెలలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు గురువారం(సెప్టెంబర్-10,2020)అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్స్ ను అధికారికంగా IAF కు అప్పగించనున్నారు.
అంబాలాలో జరిగే ఈవెంట్ లో రాజ్ నాథ్ సింగ్ తో పాటుగా త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా ఉన్నతస్థాయి సైన్యాధికారులతో పాటుగా ముఖ్య అతిధిగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్టీ పాల్గొననున్నారు. రాఫెల్ విమానాలను IAF కు అప్పగించే వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ అత్యాధునిక విమానాలను గురువారం అధికారికంగా ప్రారంభిస్తుండటంతో భారత వాయుసేనకు చెందిన 17 గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్లో రాఫెల్ విమానాలు భాగం కానున్నాయి. 5 రఫెల్ విమానాల్లో…రెండు సీట్లు కలిగిన శిక్షణ విమానాలు కాగా, మరో మూడు ఒకే సీటు కలిగిన యుద్ధ విమానాలు. అదేవిధంగా, రెండో విడతలో భాగంగా అక్టోబర్ లో భారత్కు రానున్న 4 రఫెల్ యుద్ధ విమానాలను పశ్చిమబెంగాల్లోని హస్మీరా ఎయిర్ బేస్లో సురక్షితంగా ఉంచనున్నారు.
గగనతంలో వేగంగా ప్రయాణిస్తూ, భూమ్మీదున్న టార్గెట్లను కచ్చితంగా ఛేదించడం, ఎయిర్ టు ఎయిర్ ఫైట్ లోనూ దీటుగా వ్యవహరించడం, దీర్ఘ శ్రేణి రాకెట్లను కూడా మోసుకెళ్లే సామర్థ్యం తదితర ప్రత్యేకతలు రాఫెల్ సొంతం. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో ఎయిర్ ఫోర్స్ లోకి రాఫెల్ విమానాలు చేరుతుండటం భారత వాయుసేనకు మరింత బలం చేకూర్చినట్లవుతుందని డిఫెన్స్ నిపుణులు తెలిపారు.