ఫొటో షూట్ లో బిజీగా ప్రైమ్ టైమ్ మినిస్టర్

  • Published By: venkaiahnaidu ,Published On : February 22, 2019 / 03:46 PM IST
ఫొటో షూట్ లో బిజీగా ప్రైమ్ టైమ్ మినిస్టర్

పుల్వామా దాడి గురించి తెలియగానే దేశమంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంటే ప్రధాని నరేంద్రమోడీ మాత్రం ఫొటో షూట్ లో  బిజీ అయిపోయారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. అమరుల కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతే మోడీ మాత్రం నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారని..మోడీ ప్రైమ్ టైమ్ మినిస్టర్ అని రాహుల్ మిమర్శించారు. మోడీ ఫొటోషూట్ ఫొటోలను శుక్రవారం(ఫిబ్రవరి-22,2019) తన ట్విట్టర్ లో రాహుల్ పోస్ట్ చేశారు.

పుల్వామా ఉగ్రదాడి జరిగిన రోజు దేశం మొత్తం విచారం వ్యక్తం చేస్తున్న సమయంలో ఉత్తరాఖాండ్ లోని జిమ్ కార్పెట్ నేషనల్ పార్క్ లో ఓ డిస్కవరీ ఛానల్ డాక్యుమెంటరీ షూటింగ్ లో మోడీ పాల్గొన్నారంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా గురువారం మోడీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ విమర్శలను బీజేపీ ఖండించింది. ఘటన సమయంలో మోడీ డెహ్రాడూన్ లో ఉన్నారని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అరగంట ఆలస్యంగా మోడీకి పుల్వామా ఉగ్రదాడి గురించి తెలిసిందని,తెలిసిన వెంటనే తన కార్యక్రమాలన్నింటీని రద్దు చేసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులతో మోడీ మాట్లాడారని బీజేపీ తెలిపింది. పుల్వామా ఘటనను కాంగ్రెస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని గురువారం రాజమండ్రిలో పర్యటించిన బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. మోడీ దేశభక్తిని ఎవ్వరూ తప్పుబట్టలేరని, మోడీపై రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.