ఎన్నికల వేళ…సడెన్ గా బ్యాంకాక్ కు రాహుల్

  • Published By: venkaiahnaidu ,Published On : October 6, 2019 / 02:50 AM IST
ఎన్నికల వేళ…సడెన్ గా బ్యాంకాక్ కు రాహుల్

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నొకలకు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివారం సడెన్‌గా బ్యాంకాక్ ట్రిప్‌కి వెళ్లిపోయారు. ప్రస్తుతం హర్యానా,మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉండగా అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా రెండు రాష్ట్రాల్లో బీజేపీయే దుమ్మురేపింది.

ఇలాంటి పరిస్థితుల్లో తల్లి, పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి తోడుగా ఉంటూ… పార్టీని ముందుకు నడిపించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉంది. ఆల్రెడీ మొన్నటిదాకా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే ఉన్నందువల్ల… నేతలు కూడా రాహుల్ సరైన నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తుంటే… ఆయనేమో… బ్యాంకాక్ వెళ్లిపోవడం… రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది.

రాహుల్ గాంధీ అక్టోబర్ 10న తిరిగి వస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే పార్టీలో సీనియర్ నేతల వరుస రాజీనామాలు… అధిష్టానానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. పార్టీలో టికెట్ల కేటాయింపు వివక్షాపూరితంగా సాగుతోందంటూ…అధినేత్రి సోనియాగాంధీ ఇంటిముందు ధర్నా చేసిన హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వార్… పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. ఇకపై సాధారణ కార్యకర్తగా మాత్రమే ఉంటానని ప్రకటించారు. అశోక్ తన్వార్‌కి… రాహుల్ గాంధీతో సత్సంబంధాలున్న విషయం తెలిసిందే.

అటు మహారాష్ట్రలోనూ…కాంగ్రెస్ సీనియర్ నేత సంజయ్ నిరుపం…తన మద్దతుదారుకు టికెట్ ఇవ్వకపోతే… తాను పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోనని తెలిపారు. హైకమాండ్‌కి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని ఆయన అనడాన్ని బట్టీ… మహారాష్ట్ర కాంగ్రెస్‌లో ఎంత గందరగోళం ఉందో అర్థం చేసుకోవచ్చు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అక్టోబర్ 21,2019న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 24 న ఫలితాలు ప్రకటించబడతాయి.