రాహుల్,అఖిలేష్ లు భారత ఇంజనీర్లను అవమానించారు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు భారత ఇంజనీర్లను అవమానించారన్నారు ప్రధాని నరేంద్రమోడీ. దేశంలో మొట్టమొదటి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) లక్ష్యంగా విమర్శలు చేయడం దురదృష్టకరమని, ఇది ప్రాజెక్టులో భాగమైన ఇంజనీర్లను, టెక్నీషియన్స్ ని అవమానించడమేన్నారు. మంగళవారం(ఫిబ్రవరి-19,2019) వారణాశిలో వివిధ అభివద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోడీ.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంజనీర్లను,టెక్నీషిన్స్ ని,దేశాన్ని ఎగతాలి చేస్తూ నెగిటీవ్ గా మాట్లాడేవారి పట్ల దేశప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నైతిక స్థైర్యం కోల్పోరాదని ప్రజలకు మోడీ సూచించారు. ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ కి తాను సెల్యూట్ చేస్తున్నానని మోడీ అన్నారు. భవిష్యత్తులో భారత్ లో వీరు బుల్లెట్ రైలుని తయారుచేసి పట్టాలపై పరుగులు పెట్టిస్తారన్నారు. ఇంజనీర్ల శ్రమను చూసి దేశం గర్విస్తోందన్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని ప్రధాని మోడీ ఢిల్లీలో ఫిబ్రవరి-15న ప్రారంభించిన మరుసటి రోజే వారణాశి నుంచి ఢిల్లీకి తిరిగి వస్తూ టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా కొద్ది సేపు రైలు ఆగిపోవడంపై రాహుల్, అఖిలేష్ లు సెటైర్లు వేసిన విషయం తెలిసిందే.
వారణాశి పర్యటన సందర్భంగా బనారస్ హిందూ యూనివర్శిటీలో మదన్ మోహన్ మాల్వియా కాన్సర్ సెంటర్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా కూడా పాల్గొన్నారు. ఇవాళ సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా రవిదాస్ జన్మస్థలి ఏరియా ప్రాజెక్టును మోడీ శంకుస్థాపన చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరుడైన వారణాశికి చెందిన రమేష్ యాదవ్ కి ఈ సందర్భంగా మోడీ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్ల కుటుంబాలకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని మోడీ అన్నారు.