తమిళనాడుకు రాహుల్, మూడు రోజులు అక్కడే

తమిళనాడుకు రాహుల్, మూడు రోజులు అక్కడే

Rahul Gandhi Tamil Nadu : దక్షిణాది రాష్ట్రాలపై కాంగ్రెస్‌ నాయకత్వం దృష్టి సారించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మూడు రోజుల పాటు తమిళనాడులో పర్యటించనున్నారు. ఈ రోజు నుంచి జనవరి 25 వరకు తమిళనాడులో తిర్పూర్‌, కోయంబత్తూర్‌, ఈరోడ్‌, కరూర్‌లలో రాహుల్‌ గాంధీ పర్యటిస్తారు. ఈ ఏప్రిల్‌లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాహుల్‌ గాంధీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

తమిళనాడులో ఎన్నికల వేడి రాజుకుంది. సాధారణ ఎన్నికలకు మరో రెండు నెలలే సమయం మిగిలి ఉండటంతో అన్ని పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. కాంగ్రెస్‌ మిత్ర పక్షం డీఎంకే రెండు నెలల ముందు నుంచే ప్రచారం మొదలు పెట్టింది. తాజాగా రాహుల్‌ గాంధీ సైతం ఎన్నికల ప్రచారంలో భాగం అవుతున్నారు. మూడు రోజుల తమిళనాడు పర్యటనలో భాగంగా రాహుల్‌ గాంధీ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తిర్పూర్‌తో పాటు కోయంబత్తూర్‌, ఈరోడ్‌, కరూర్‌లలో రాహుల్‌ పర్యటిస్తారు. చిన్నతరహా పరిశ్రమల ప్రతినిధులు , కార్మికులు, కార్మిక సంఘాల నేతలు, చేనేత కార్మికులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత రైతులతో నేరుగా మాట్లాడుతారు. రైతు సమస్యలను కరూర్‌ సభలో రాహుల్‌ గాంధీ ప్రస్తావిస్తారని తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీకి డీఎంకే మిత్రపక్షంగా ఉంది. ప్రీ పోల్‌ సర్వేలో డీఏంకే, కాంగ్రెస్‌ కూటమికి అసెంబ్లీ ఎన్నికల్లో సానుకూల వాతావరణం ఉన్నట్టు చెబుతున్నాయి. దీంతో వరుసగా తమిళనాడు పర్యటనలు చేస్తున్నారు రాహుల్‌ గాంధీ. అంతకు ముందు జల్లికట్టు క్రీడను తిలకించేందుకు తమిళనాడుకు వచ్చారు రాహుల్‌ గాంధీ.