Uttar Pradesh Rains: ఉత్తర ప్రదేశ్ను ముంచెత్తిన వానలు.. 13 మంది మృతి.. పలు ప్రాంతాలు జలమయం
ఉత్తర ప్రదేశ్తోపాటు ఢిల్లీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలి వరదల ప్రభావానికి ఉత్తర ప్రదేశ్లో 13 మంది మరణించారు. మరో 11 మంది గాయపడ్డారు. ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Uttar Pradesh Rains: ఉత్తర ప్రదేశ్ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. సమీపంలోని ఢిల్లీతోపాటు గుర్గావ్, ఫిరోజాబాద్, అలీఘడ్ వంటి ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
ఇటీవలి వర్షాలకు 13 మంది మరణించారు. వరదలో కొట్టుకుపోవడం, పిడుగులు, గోడ కూలడం వంటి ఘటనల్లో వీళ్లంతా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. వర్షాల ప్రభావంతో వరుసగా స్కూళ్లు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు నోయిడా, గ్రేటర్ నోయిడాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో గురువారం సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఎనిమిదన్నర గంటల వరకు.. అంటే మూడు గంటల్లోనూ 40.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. ఢిల్లీలో భారీ వర్షం కురవడం వరుసగా ఇది మూడో రోజు. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. సాధారణం కంటే తక్కువగా అంటే 22-28 డిగ్రీల ఎండ మాత్రమే నమోదవుతోంది. ఢిల్లీలో వర్షాలు, వరదల ప్రభావంతో అనేక రోడ్లు నీటితో నిండిపోయాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఈ నేపథ్యంలో డెంగీ జ్వరాలు విజృంభించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.