Rajasthan CM Counter : రాజస్థాన్ రాద్దాంతం..సచిన్ పైలట్ వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ స్ట్రాంగ్ కౌంటర్..ఎవ్వరూ లైన్ దాటొద్దంటూ వార్నింగ్
రాజస్థాన్ కాంగ్రెస్ ప్రభుత్వం రాద్దాంతం కొనసాగుతోంది. ఈక్రమంలో సచిన్ పైలట్ వ్యాఖ్యలకు అశోక్ గెహ్లాట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అందరు క్రమశిక్షణతో ఉండాలని ఎవ్వరూ లైన్ దాటొద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.
Rajasthan CM Counter to Sachin Pilot : రాజస్థాన్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్కి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణలో ఉండాలంటూ రివర్స్ షాకిచ్చారు. అశోక్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలన్న పైలట్ డిమాండ్పై ఘాటుగా స్పందించారాయన. వాళ్లు అలా మాట్లాడకూడదు.. ప్రతి ఒక్కరూ డిసిప్లిన్లో ఉండాల్సిందేనని సీఎం పరోక్షంగా హెచ్చరించడం హాట్ టాపిక్గా మారింది.
ఇప్పటికే రెండు వర్గాలుగా చీలిపోయిన రాజస్థాన్ కాంగ్రెస్లో ఎమ్మెల్యేలపై చర్యల వ్యవహారం హీట్ రాజేసింది. అధిష్టానం మాటను ధిక్కరించిన అశోక్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందేనని.. ఆ వ్యవహారానికి శుభం కార్డు వేయాలని సచిన్ పైలట్ కొత్త చీఫ్ ఖర్గేను కోరడం కొత్త వివాదానికి దారి తీసింది. మరోమారు ఇద్దరు నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. చర్యలు తీసుకోవాలని సచిన్ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే అశోక్ గెహ్లాట్ ఘాటు రిప్లై ఇచ్చారు. ఇంతకాలం మౌనం వహించిన సీఎం గెహ్లాట్ ఎవ్వరూ పార్టీ లైన్ దాటొద్దంటూ పరోక్షంగా హెచ్చరికలు చేయడం హాట్ హాట్గా మారింది.
షోకాజ్ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ కాంగ్రెస్ కొత్త చీఫ్ మలికార్జున ఖర్గేను కోరడంపై ఘాటుగా స్పందించారు ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్. సచిన్ పైలట్ వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. కాంగ్రెస్ అగ్ర నేత కేసీ వేణుగోపాల్ చెప్పినట్లు అందరూ క్రమశిక్షణ పాటించాల్సిందేనన్నారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటకూడదంటూ పైలట్ను ఉద్దేశించి సీఎం గెహ్లాట్ వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
దేశంలో హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ముఖ్యమంత్రి గెహ్లాట్ అన్నారు. వాటిపైనే తమ పోరాటమన్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా అదే సమస్యపై పోరాడుతున్నారని.. కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకే వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చామన్నారు గెహ్లాట్. సుపరిపాలన అందించడం ద్వారా కాంగ్రెస్ను రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామని సచిన్పై పరోక్షంగా సెటైర్లు వేశారు.