13 ఏళ్ల బాలికను కొని..పెళ్లి చేసుకుని..లైంగిక దాడి చేసిన 30 ఏళ్ల వ్యక్తి

  • Published By: murthy ,Published On : September 11, 2020 / 12:42 PM IST
13 ఏళ్ల బాలికను కొని..పెళ్లి చేసుకుని..లైంగిక దాడి చేసిన 30 ఏళ్ల వ్యక్తి

రాజస్ధాన్ లోని చిత్తోర్ ఘర్ కు చెందిన 30 ఏళ్ల వ్యక్తి ఉత్తర ప్రదేశ్ కు చెందిన 13 ఏళ్ల బాలికను కొన్నాడు. ఆమెను బలంతంగా పెళ్ళి చేసుకుని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఎట్టకేలకు బాలిక  చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయటంతో  ఆ రాక్షసుడి  బారినుంచి  బయటపడింది.

చిత్తోర్ ఘర్ జిల్లా బబ్రానా  గ్రామానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి …ఉత్తర ప్రదేశ్ లోని సోనాభద్రకు  చెందిన 13 ఏళ్ల బాలికను 7 నెలల క్రితం కొనుగోలు చేశాడు. బాలికను  తన గ్రామానికి తీసుకు వచ్చి, బహిరంగంగా వివాహాం చేసుకున్నాడు.



గత 7 నెలలుగా ఆమెపై  లైంగిక  దాడి చేస్తున్నాడు ఎట్టకేలకు ఆ బాలిక చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేయగలిగింది.  వారు వెంటనే బాలిక చెప్పిన చిరునామాకు వచ్చి ఆమెను రక్షించి రెస్క్యూ హోమ్ కు తరలించారు. బాలికా ఆశ్రయ గృహంలో  డాక్టర్ శైలేంద్ర పాండ్యా ఆమెకు చికిత్స అందిస్తున్నారు.  జరిగిన ఘటనను  వివరించమని ఆయన కోరగా బాలిక తాను పడిన కష్టాలను డాక్టర్ కు వివరించింది.

ఉత్తర ప్రదేశ్ లోని సోన్ భద్రకు చెందిన 6వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక తల్లితండ్రులు ఇద్దరు అక్కలు, ఒక అన్నతో కలిసి జీవిస్తోంది. వీరి ఇంటి సమీపంలో నివసించే లక్ష్మీ దదీచ్ అనే మహిళ, భిల్వారా కు చెందిన సత్య నారాయణ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.



లక్ష్మి దదీచ్ ఈ ఏడాది ఫిబ్రవరి 14న బాలికను బయటకు వెళదామని చెప్పి చిత్తోర్ ఘర్ తీసుకు వచ్చింది. అక్కడ బబ్రానాకు చెందిన బసంతి లాల్ దదీచికి రూ.2.70 లక్షలకు బాలికను అమ్మేసింది.  డబ్బు చెల్లించిన తర్వాత బసంతిలాల్ బాలికను తన గ్రామం  చిత్తోర్ ఘర్ కు తీసుకు వచ్చాడు.

అక్కడ అందరి సమక్షంలో బహిరంగంగా బాలిక మెడలో తాళి కట్టాడు. అప్పటి నుంచి ఆమెపై లైంగిక దాడి చేయటం ప్రారంభించాడు. ఆమెపై చేస్తున్నలైంగిక దాడికి అభ్యంతరం చెప్పగా లాల్,  అతని సోదరుడు ఆమెను తీవ్రంగా కొట్టారు. ఎట్టకేలకు బాలిక చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరు కు ఫోన్ చేయటంతో బాలిక ప్రాణాలతో  రక్షింపబడింది. అధికారులు ఆమె తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చారు.