Rakesh Tikait : రైతుల ఉద్యమానికి ఏడాది…డిమాండ్లు అంగీకరిస్తేనే ఇళ్లకు వెళుతాం
రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటలకు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు బీకేయు నేత రాకేష్ టికాయత్.
Rakesh Tikait Demands : మూడు వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ…రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆందోళనలు చేపట్టి ఏడాది పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా… 2021, నవంబర్ 26వ తేదీ శుక్రవారం సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేపట్టనున్నారు. అమరులైన రైతులకు నివాళులర్పించనున్నారు. సాగు చట్టాల రద్దు, పంటలకు మద్దతు ధర కోసం ఉద్యమం చేపడుతున్నారు. ఈనెల 19వ తేదీన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని ప్రకటన అనంతరం కూడా రైతులు వెనక్కి తగ్గడం లేదు. పార్లమెంట్ లో చట్టాల రద్దుకు ఆమోదం పొందే వరకు…ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టంగా వెల్లడించారు.
Read More : Navjot Sidhu : నిరాహార దీక్ష చేస్తా..చన్నీ ప్రభుత్వానికి సిద్ధూ హెచ్చరిక
మరోవైపు…పార్లమెంట్లో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద రైతు సంఘాలు మహా ధర్నా నిర్వహించాయి. రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటలకు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు బీకేయు నేత రాకేష్ టికాయత్. పంటకు ఎమ్ఎస్పీ గ్యారంటీ కార్డ్ వచ్చే వరకు పోరాడుతామన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాదని… ఆర్ఎస్ఎస్ నేతృత్వంలో కొనసాగుతోందన్నారు. అదానీ, అంబానీల ఆదేశాలతోనే కేంద్రం నడుస్తోందని… కార్పొరేట్ లబ్ధికి మోదీ ప్రభుత్వం తాపత్రయపడుతోందన్నారు టికాయత్. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని టికాయత్ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను కేంద్రం అంగీకరిస్తేనే ఇళ్లకు వెళ్తామన్నారు.. లేదంటే.. ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.