ఆ ఊరిలో రాఖీ పండుగ జరుగదు…ఎందుకంటే?
రక్షా బంధన్ పండుగ అంటే అన్నాచెల్లెళ్లకు ఎంతో ఇష్టం. ఒక్క తోబొట్టువకే కాకుండా బంధుత్వం ఉన్న ఎవరికైనా రాఖీ కట్టి వారి బంధాన్ని మరింత పెంచుకుంటారు. ఈ పండుగ రోజు భారతీయులందరూ ఇంటి దగ్గరే ఉండి సెలబ్రేట్ చేసుకుంటారు.
కానీ ఆ గ్రామంలో 65 సంవత్సరాలుగా ఈ పండుగ పేరే ఎత్తరు. ఉత్తర ప్రదేశ్లోని వజీరాగంజ్ పంచాయతీలోని జగత్పూర్వలో రాఖీ పండుగ జరుపుకుంటే అనర్థాలు జరుగుతాయి. వీరు గత ఆరు దశాబ్దాలుగా రాఖీని చూడలేదట.
రాఖీ కట్టడానికి గడప దాటి వెళ్తే సోదరుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వారి భయం. ‘‘1955లో రక్షా బంధన్ రోజు ఉదయం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అది కీడుకు సంకేతమని భావించి రాఖీ పండుగను చేసుకోవడం మానేశారు. అయితే, దశాబ్దం కిందట ఊర్లో రాఖీ వేడుక జరపాలని నిర్ణయించుకున్నాం. కానీ, తర్వాతి రోజు ఉదయం కూడా అవాంఛనీయ ఘటన ఒకటి చోటు చేసుకుంది.
దీంతో రాఖీ పండుగ జరపడం తమ ఊరికి, ప్రజలకు మంచిది కాదనే నిర్ణయానికి వచ్చేశాం. ఇప్పటికీ ఈ ఊర్లో ఆడవాళ్లు ఎవరూ తమ సోదరులకు రాఖీ కట్టరు’’. ఇది సంగతి. అందుకని అక్కడ ఎవరూ రాఖీ కట్టరు, కట్టించుకోరు.