PM Cares Fund: పీఎం కేర్స్ ట్రస్టీలుగా రతన్ టాటా, జస్టిస్ థామస్..
పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా పలువురి పేర్లను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇందులో ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కెటి థామస్ ...
PM Cares Fund: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీలుగా పలువురి పేర్లను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇందులో ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కెటి థామస్, లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా సహా ప్రముఖులు పీఎం కేర్స్ ఫండ్కు ట్రస్టీలుగా నామినేట్ అయినట్లు ప్రభుత్వం బుధవారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. కొత్తగా నియామకమైన సభ్యులతో సహా పీఎం కేర్స్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలతో ప్రధాని సమావేశమైన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన పీఎం కేర్స్ ఫండ్ సభ్యులతో మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లు హాజరయ్యారు. 4345 మంది పిల్లలకు మద్దతిచ్చే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ తో సహా పీఎం కేర్స్ ఫండ్ సహాయంతో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశానికి కీలకమైన సమయంలో ఫండ్ పోషించిన పాత్రను ట్రస్టీలు అభినందించారు. పీఎం కేర్స్ ఫండ్ కు మనస్ఫూర్తిగా సహకరించినందుకు దేశ ప్రజలను ప్రధాని మోదీ అభినందించారు.
ఇదిలాఉంటే పీఎం కేర్స్ ఫండ్లో అంతర్భాగమైనందుకు ట్రస్టీలను ప్రధాని స్వాగతించారని ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు పీఎం కేర్స్ ఫండ్ సలహాదారుల బోర్డుకు కాగ్ మాజీ అధికారి రాజీవ్ మెహ్రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు ఆనంద్ షా ఫండ్ యొక్క సలహా బోర్డులోకి నామినేట్ అయ్యారు.అయితే కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం పీఎం కేర్స్ ఫండ్ పనితీరుకు విస్తృత దృక్పథాలను అందిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రజా జీవితంలో వారి అపార అనుభవం వివిధ ప్రజా అవసరాలకు మరింత ప్రతిస్పందించేలా చేయడంలో మరింత శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు.