షాజహాన్ కట్టించిన అద్భుతమైన ఎర్రకోట.. ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం

షాజహాన్ కట్టించిన అద్భుతమైన ఎర్రకోట.. ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం

అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్.. హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.. ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే… ఇదే…అనే అర్థాన్నిచ్చే అక్షరాలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి. పర్షియా కవి అమీర్‌ ఖుస్రో రాసిన కవితలోని ఈ వ్యాఖ్యలను చెక్కించింది మొగల్‌ చక్రవర్తి షాజహాన్‌. ఎర్రకోట నమూనాను రూపొందించి.. దగ్గరుండి నిర్మించింది కూడా షాజహానే.

ఎర్ర చలువరాతితో అద్భుతంగా నిర్మించిన ఈ కోట వెనుక 370 ఏళ్ల చరిత్ర ఉంది. కోట నిర్మాణాన్ని 1638లో ప్రారంభిస్తే 1648లో పూర్తయింది. యమునా నది ఒడ్డున మొత్తం 120 ఎకరాల సువిశాల స్థలంలో ఈ కోటను పర్షియా నుంచి రప్పించిన నిపుణులతో కట్టించారు.

ఎర్రకోటను గతంలో కిలా-ఏ-మొహల్లా అని పిలిచేవారు. ఇది షాజానాబాద్‌కు రాజధాని నగరంగా వుండేది. ఈ కోటను 17 వ శతాబ్దపు మధ్య భాగంలో నిర్మించారు. ఎర్ర రాతితో నిర్మించిన ఈ కోట ప్రపంచంలోనే అందమైంది. 2.41 కి. మీ.ల విస్తీర్ణం ఉన్న రెండు మెయిన్ గేటులు ఉన్నాయి. 2007లో ఎర్ర కోట ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో అనౌన్స్ చేసింది. అందమైన ఈ నిర్మాణం ఎన్నో అద్భుత కట్టడాలను కలిగి ఉంటుంది. ఈ అద్భుతాలలో దివాన్-యి-ఆం ఒకటి.

ఈ ప్రదేశంలో రాజు ప్రజల సమస్యలను విని పరిష్కరించే వాడు. ప్రైవేటు మీటింగుల కు కాన్ఫరెన్స్ లకు దివాన్-యి-ఖాస్ అనే భవనం ఉండేది. తర్వాతి కాలంలో మోతీ మసీదుని నిర్మించారు. ఆ తర్వాత మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్‌కు వ్యక్తిగత మసీదుగా మార్చారు.

చట్టా చౌక్ అనేది ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ లో ఒక షాపింగ్ ప్రాంతం. ఇక్కడ రాజ కుటుంబాలకు అవసరమైన సిల్క్, ఆభరణాలు, ఇతర వస్తువులను మొఘల్ పాలనలో విక్రయించే వారు. దివాన్ యి ఆంలో చక్రవర్తి షాజహాన్ ప్రజల సమస్యలు, ఫిర్యాదులను వినేవాడు. బాల్కనీలో ఒక సింహాసనంపై కూర్చొని ఫిర్యాదులను వినేవాడు. దివాన్ యి ఖాస్ లేదా ఖాస్ మహల్ అనేది

ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్‌లో ఒక ప్రైవేటు ప్రాంతం. ఇందులో షాజహాన్ చక్రవర్తి తన అతిధులతో సమావేశం అయ్యేవాడు. రెడ్ ఫోర్ట్ లో షాజహాన్ నిర్మించిన ఆరు భవనాలలో ముంతాజ్ మహల్ ఒకటి. ఎర్ర కోటలో రంగ్‌మహల్ ప్రవేశాన్ని నక్కర్ ఖానా అంటారు. మూడు అంతస్తులున్న ఈ భవనం రాచ కుటుంబ సభ్యుల సంగీత వాయిద్యాలకు ఉపయోగించేవారు.

కోటలో చక్రవర్తి సభలు జరిపే మండపం 50 అడుగుల పొడవు… 24 అడుగుల వెడల్పుతో ఉంటుంది. సభాస్థలి పైకప్పు, గోడలను వెండి బంగారు తాపడంతో చేయించారు. ఇందులోనే ప్రపంచ ప్రఖ్యాతమైన నెమలి సింహాసనం ఉండేది. ఫ్రెంచి స్వర్ణకారుడు మణులు, వజ్రాలను పొదిగి చేసిన దీనిపైనే చక్రవర్తి ఆసీనుడై సభను నడిపేవాడు. కోటలోని ఉద్యానవనాలు, పాలరాయి మండపాలు, నీటిని చిమ్మే ఫౌంటెన్లు అద్భుతంగా ఉంటాయి. ఎన్నో చారిత్రక ఘట్టాలకు ఈ కోట మౌన సాక్షి.

1657లో షాజహాన్‌ నలుగురు కుమారుల వారసత్వ పోరును ఈ కోట చూసింది. సోదరులను చంపించి షాజహాన్‌ను ఖైదు చేసి జౌరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించడం దీనికి తెలుసు. తర్వాత 50 ఏళ్లలో 9 మంది రాజుల పాలనను కూడా చూసింది లాల్‌ ఖిల్లా.

ఎర్రకోట అత్యుత్తమ స్థాయి కళా రూపానికి, అలంకారపు పనితీరుకి అద్దం పడుతుంది. కోట గోడలు నున్నగా అలంకరించబడి, పై భాగంలో భారీగా తీగల అలంకారాలు కలిగి ఉంటాయి. కోట ప్రహరీగోడ రెండు కిలోమీటర్ల పొడవుగా.. దాదాపు 90 అడుగులకు పైగా ఎత్తుతో ఉంటుంది. ఇందులో ముంతాజ్‌ మహల్‌ మ్యూజియం, మోతీ మజీద్‌, రంగ్‌మహల్‌ ఇప్పటికీ కనువిందు చేస్తాయి. బ్లడ్‌ పెయింటింగ్స్‌ మ్యూజియం, పురావస్తు మ్యూజియం, యుద్ధ స్మారక ప్రదర్శన శాలలు ఎర్రకోటలో ఇప్పటికీ ఎంతోమంది పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.