కరోనాతో ప్రముఖ శిల్పి,బీజేపీ ఎంపీ రఘునాథ్ మోహపాత్ర మృతి
Renowned Sculptor ఒడిషా కు చెందిన ప్రముఖ శిల్పి,బీజేపీ రాజ్యసభ ఎంపీ రఘునాథ్ మోహపాత్ర(78) కన్నుమూశారు. గతవారం వైరస్ బారినపడిన రఘునాథ్ మోహపాత్ర.. భువనేశ్వర్ లోని ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఆదివారం మృతి చెందారు.
ఒడిశాకు చెందిన రఘునాథ్ మొహపాత్ర అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శిల్పకారుడు. ఆయన చెక్కిన ఆరు అడుగుల సూర్యదేవుడి విగ్రహం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉంది. పారిస్లోని బుద్ధ దేవాలయంలో బుద్ధుని చెక్క శిల్పం ఆయన చెక్కినదే. పూరిలోని శ్రీ జగన్నాథ్ ఆలయం మరియు కోనార్క్ సూర్యదేవాలయం సహా ఒడిశాలోని అనేక పురాతన స్మారక కట్టడాల సంరక్షణలో ఆయన సంప్రదింపుల నిపుణుడిగా పనిచేశారు. భువనేశ్వర్ శివార్లలో ‘రెండవ సూర్య దేవాలయం’ నిర్మించాలనే ప్రతిష్టాత్మక ఆలోచనను కూడా ఆయనదే.
ఆలయ నిర్మాణంలో సాంప్రదాయ శైలిపై స్పష్టమైన అవగాహన ఉన్న రఘునాథ్ మోహపాత్రకు.. 1975లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్ అవార్డులు లభించాయి. 2013లో ఆయనను పద్మవిభూషణ్ అవార్డు వరించింది. 2018లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రఘునాథ్ మొహ పాత్రను రాజ్యసభకు నామినేట్ చేశారు.