Bengal Violence: ఎన్నికల తర్వాత హింసపై విచారణ జరగాల్సిందే: హైకోర్టు
బెంగాల్ లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ జరగాల్సిందేనని హైకోర్టు వెల్లడించింది. ఒకవిధంగా ఇది మమతా బెనర్జీకి షాక్ తగిలినట్లే. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసపై ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వం విన్నవించింది.
Bengal Violence: బెంగాల్ లో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) విచారణ జరగాల్సిందేనని హైకోర్టు వెల్లడించింది. ఒకవిధంగా ఇది మమతా బెనర్జీకి షాక్ తగిలినట్లే. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసపై ఎన్హెచ్ఆర్సీ విచారణ చేపట్టాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని బెంగాల్ ప్రభుత్వం విన్నవించింది. కానీ, కోర్టు అందుకు ససేమీరా అంటూ విచారణ కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలన్నింటిపై ఎన్హెచ్ఆర్సీతో అధ్యయనం చేయించాలని హైకోర్టు గతంలో ఉత్తర్వులివ్వగా.. వీటిని ఉపసంహరించాలంటూ తృణమూల్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్ సారథ్యంలోని ధర్మాసనం అందుకు నిరాకరించింది. ప్రభుత్వం చేసిన వినతిని ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది.
బెంగాల్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్య కార్యదర్శి నివేదిక ఆధారంగా ఈ కేసులన్నింటినీ పరిశీలించాల్సిందిగా హైకోర్టు తన ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో హింసాత్మక సంఘటనలపై విచారణకు ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ సోమవారం ఓ కమిటీని ఏర్పాటు చేయగా ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు రాజీవ్జైన్ సారథ్యం వహించే ఈ కమిటీ తక్షణమే పని ఆరంభించింది. ఇప్పటికే వచ్చిన ఫిర్యాదులతోపాటు తాజా ఫిర్యాదులనూ కమిటీ విచారిస్తుంది. కాగా.. ఈ విచారణ అనంతరం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు తలెత్తే అవకాశం ఉంది.