Indian Markets : రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో కుప్పకూలిన భారత మార్కెట్లు
ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో 2వేల పాయింట్లు పడిపోయాయి. తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి.
Russia-Ukraine war : రష్యా, యుక్రెయిన్ యుద్ధంతో భారత మార్కెట్లు కుప్పకూలాయి. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద సెకన్లలో మాయమైంది. దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 2వేల 7వందల పాయింట్లు కోల్పోయింది. కొన్ని నెలల క్రితం 60వేలకు ఎగువన ట్రేడయిన సెన్సెక్స్ ఇప్పుడు 55వేల స్థాయికి చేరింది. ఇక నిఫ్టీ కూడా 815 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 16వేల 247వద్ద ముగిసింది. కీలకమైన 16వేల 3వందల మద్దతును కోల్పోయింది.
ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు ఓ దశలో 2వేల పాయింట్లు పడిపోయాయి. తర్వాత కాస్త కోలుకున్నట్లు కనిపించాయి. మధ్యాహ్నం తర్వాత మళ్లీ నష్టాల్లోకి మళ్లాయి. ఏకంగా 2వేల 7వందల పాయింట్లు నష్టపోయాయి. బ్యాంకు నిఫ్టీ కూడా 2వేల పాయింట్లకు పైగానే కోల్పోయింది. ఇండెక్స్లో ఒక్కటంటే ఒక్క షేరు కూడా లాభపడలేదు. హిందాల్కో ఇండస్ట్రీస్ ఒక్కటే మధ్యాహ్నం వరకూ స్వల్ప లాభాలతో కదలాడింది. అయితే చివర్లో అమ్మకాల ఒత్తిడితో అది కూడా నష్టపోయింది. టాటామోటర్స్ ధర 10శాతానికి పైగా పడిపోయింది.
Indian Citizens : యుక్రెయిన్పై రష్యా దండయాత్ర.. యుక్రెయిన్లో ఉన్న భారత పౌరుల కుటుంబీకుల్లో ఆందోళన
యూపీఎల్, ఇండస్ఇండ్, గ్రాసిమ్, అదానీపోర్ట్ షేర్లకు నష్టాలు తప్పలేదు. ఇక హీరో మోటోకార్ప్స్ 180 రూపాయలు నష్టపోతే…. శ్రీ సిమెంట్స్ ఏకంగా 14వందల 51రూపాయలు పడిపోయింది. బజాజ్ ఫైనాన్స్ 416, దివీస్ ల్యాబ్ 244, బజాజ్ ఫిన్సర్వ్ 888 రూపాయలు పడిపోయాయి. మరోవైపు రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రభావం LIC-IPOపై ఉండబోదని కేంద్రం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారమే ముందుకెళతామని తెలిపింది.
జనవరి రెండో వారం నుంచి మార్కెట్లు బేర్మంటున్నాయి. వరుస పరిణామాలు మార్కెట్లను కుంగతీస్తున్నాయి. జనవరి 18న 18వేల 350 దగ్గరున్న నిఫ్టీ ఇప్పుడు 16వేల 2వందల వద్ద ట్రేడవుతోంది. నెలరోజుల్లో నిఫ్టీ దాదాపు 10శాతం పడిపోయింది. గతేడాది మార్కెట్లలో కొనసాగిన ర్యాలీకి ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుందన్న వార్తలతో బ్రేక్ పడింది. అప్పట్నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మార్కెట్ ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధంతో మరింత పతనమయ్యాయి.